
వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ (అనంతబాబు) ప్రస్తుతం ఎక్కడున్నారనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్సీ అనంతబాబు.. తన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే అనంతబాబును ఇంకా ఎందుకు అరెస్ట్ చేయడం లేదని దళిత సంఘాలు, ప్రజ సంఘాలు పోలీసులను ప్రశ్నిస్తున్నాయి. మరోవైపు ఎమ్మెల్సీ అనంతబాబు కోసం గాలింపు చేపట్టినట్టుగా పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఆదివారం అదుపులోకి తీసుకుంటే కస్టడీలోనే ఉంచాలనే ఉద్దేశంతోనే పోలీసులు తాత్సారం చేస్తున్నారనే ఆరోరపణలు ఉన్నాయి.
అయితే తాజా సమాచారం ప్రకారం.. ఎమ్మెల్సీ అనంతబాబు పోలీసుల అదుపులోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ కేసులో అనంతబాబుతో పాటు మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం. అయితే అరెస్ట్ విషయం బయటకు చెప్పకుండా రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే కాసేపట్లో ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చూపే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్సీని కోర్టు తీసుకొస్తే లా అండ్ అర్డర్ సమస్య వచ్చే అవకాశం ఉండటంతో.. మేజిస్ట్రేట్ ఇంటికి తీసుకెళ్లేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు పోలీసులు ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
ఇక, ఈ కేసుకు సంబంధించి స్థానిక పోలీసులు తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అనంతబాబు అధికార పార్టీ నేత కావడంతోనే సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యుల వాదనలను తొలుత పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. చివరకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాల నేపథ్యంలో తొలుత అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు.. తర్వాత హత్య కేసుగా మార్చారు.
పోస్టుమార్టమ్ ప్రాథమిక రిపోర్ట్లో ఏముందంటే..?
సుబ్రహ్మణ్యం పోస్టుమార్టమ్ ప్రాథమిక నివేదికలో అతడికి కొట్టి చంపినట్టుగా తేలిందని సమాచారం. మృతుడి బట్టలపై బీచ్లో మట్టి, ఇసుక.. ఒంటిపై కాళ్లతో తన్నిన గుర్తులు, సుబ్రహ్మణ్యం తల మీద ఎడమవైపు గాయం ఉన్నట్టుగా వైద్యులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఎడమ కాలు బొటన వేలుపై, కుడి కాలు మడెం దగ్గర, ఎడమ చేయి, పై పెదవిపై గాయాలు ఉన్నట్టుగా వైద్యులు గుర్తించారని సమాచారం.
ఇక, సుబ్రహ్మణ్యం పోస్టుమార్టమ్ విషయంలో తీవ్ర ఉత్కంఠ కొనసాగిన సంగతి తెలిసిందే.. చివరకు సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులను సాయంత్రం పోలీసులు కాకినాడ జీజీహెచ్ మార్చురీ వద్దకు తీసుకొచ్చారు. అనంతరం శవ పంచనామా నిర్వహించారు. అయినప్పటికీ పోస్టుమార్టమ్ అంగీకారపత్రంపై సంతకాలు చేసేందుకు సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. ఇక, ఈ కేసులో ఉదయభాస్కర్ను అరెస్ట్ చేస్తామని శనివారం రాత్రి ఎస్పీ ప్రకటించారు.
తొలుత మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అనుమానస్పద మృతి కేసు నమోదు చేశామని ఎస్పీ చెప్పారు. మృతుడి కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు సేకరించామని.. ఆ మేరకు సెక్షన్ 302 కిందకు మారుస్తామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధ కేసు కూడా పెడతామన్నారు. కేసు నమోదయ్యాక పోస్టుమార్టం చేసిన తర్వాతే.. దాని నివేదిక ప్రకారం కేసులో సెక్షన్లు పెట్టాల్సి ఉంటుందన్నారు. ఎస్పీ ప్రకటన తర్వాత సుబ్రహ్మణ్యం మృతదేహానికి పోస్టుమార్టమ్ నిర్వహించేందుకు అతడి కుటుంబ సభ్యులు అంగీకరించారు. పోస్టుమార్టమ్ అనంతరం సుబ్రహ్మణ్యం స్వగ్రామం పెదపూడి మండలం జి మామిడాడకు మృతదేహాన్ని తరలించారు. సుబ్రహ్మణ్యం మృతదేహానికి ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు.