తప్పంతా చంద్రబాబుదేనా ?

First Published Dec 1, 2017, 2:58 PM IST
Highlights
  • ‘పార్టీ బలోపేతానికే ఇతర పార్టీ నేతలను చేర్చుకుంటున్నాం’..
  • ‘వివాదాలు తలెత్తకూడదనే అందరికీ పదవులు ఇస్తున్నాం’..
  • ‘ఇంతకన్నా ఎవరైనా ఏం చేయగలరు’?..

                                              ‘పార్టీ బలోపేతానికే ఇతర పార్టీ నేతలను చేర్చుకుంటున్నాం’..

                                              ‘వివాదాలు తలెత్తకూడదనే అందరికీ పదవులు ఇస్తున్నాం’..

                                             ‘ఇంతకన్నా ఎవరైనా ఏం చేయగలరు’?..

ఇవి తాజాగా చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలు. గురువారం రాత్రి ప్రకాశం జిల్లా సమన్వయ కమిటి సమావేశంలో ఎంఎల్ఏ గొట్టిపాటి రవికుమార్, ఎంఎల్సీ కరణం బలరాంలు కుర్చీలతో కొట్టుకున్నారు. వీరిద్దరినీ నిలువరించలేక చివరకు సమావేవాన్ని అర్ధాంతరంగా ముగించేశారు. అంటే వారిద్దరి మధ్య గొడవ ఏ స్ధాయిలో జరిగిందో ఊహించుకోవాల్సిందే. ఆ విషయాన్నే శుక్రవారం మధ్యహ్నం చంద్రబాబు టిడిఎల్పీ సమావేశంలో ప్రస్తావించారు. నేతలిద్దరిపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. సరే, చంద్రబాబు మాటను వినే దశను నేతలెవరూ లేరనుకోండి అది వేరే సంగతి.

ఇంతకీ మొత్తం వివాదంలో ఎవరిది తప్పు ? అంటే, కచ్చితంగా చంద్రబాబుదే అని చెప్పాలి. ఎందుకంటే, ఉప్పు-నిప్పు లాంటి నేతలను, ఫ్యాక్షన్ లీడర్లను కలిసి పనిచేసుకోమని చెప్పటం చంద్రబాబు తప్పే. పైగా ఇద్దరు ఒకే నియోజకవర్గం నేతలైతే ఇక చెప్పాల్సిన అవసరమే లేదు. చాలా నియోజకవర్గాల్లో జరుగుతున్నదదే. ప్రకాశం జిల్లాలోని అద్దంకి నియోజకవర్గాన్నే ఉదాహరణగా తీసుకుందాం.

దశాబ్దాలుగా కరణం-గొట్టిపాటి కుటుంబాల మధ్య ఫ్యాక్షన్ రాజకీయాలు నడుస్తోంది. అవకాశం దొరికితే చాలు ఒక వర్గం మరొక వర్గంపై దాడులు చేసుకుని  హత్యలకు కూడా తెగబడుతున్నాయి.  కరణం మొదటి నుండి టిడిపిలోనే ఉంటే, గొట్టిపాటి కాంగ్రెస్ లో ఉండేవారు. సరే, రాష్ట్ర విభజన తర్వాత గొట్టిపాటి వైసిపిలో చేరారు. మొన్నటి ఎన్నికల్లో అద్దంకిలో కరణం బలరాంపై గొట్టిపాటి రవికుమార్ గెలిచారు. ఇద్దరూ చెరో పార్టీలో ఉండేవారు కాబట్టి ఫ్యాక్షన్ రాజకీయాల్లో ఓ స్పష్టత ఉండేది.

ఎప్పుడైతే చంద్రబాబు ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారో గొట్టిపాటి కూడా వైసిపి నుండి టిడిపిలో చేరారు. దాంతో సమస్యలు మొదలయ్యాయి. ఇద్దరు ఒకే పార్టీలో ఇమడలేకపోతున్నారు. అందుకే వీళ్ళ వర్గాలు వరుసగా దాడులు, హత్యలకు తెగపడుతున్నాయి. దీన్ని చంద్రబాబు కూడా ఆపలేక పోతున్నారు. ఇటువంటి గొడవలు అద్దంకికే పరిమితం కాలేదు. కడప జిల్లాలోని జమ్మలమడుగు, బద్వేలు, అనంతపురం జిల్లాలోని కదిరి లాంటి మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా ఉంది. ఉప్పు-నిప్పు లాంటి నేతలను ఒకేపార్టీలో ఉంచుకోవాలన్న చంద్రబాబు ప్రయత్నమే తప్పు. వీళ్ళ మధ్య పరిస్ధితి ఇపుడే ఇలావుంటే, రేపు ఎన్నికలపుడు టిక్కెట్ల కోసం ఇంకెత గొడవలవుతాయో ఊహించుకోవటానికే భయమేస్తోంది.

 

click me!