
తిరుమల తిరుపతి దేవస్థానంలో కీలకమైన ఈఓ పోస్టును ఉత్తరాదివారికి ఇవ్వడంపై ఏపీలోని అధికారులే కాదు ఇప్పుడు స్వామిజీలు భగ్గుమంటున్నారు.
దీనిపై చంద్రబాబు సర్కారును కోర్టుకు ఈడ్చడానికి సిద్ధమని స్వామి స్వరూపానంద సరస్వతి ప్రకటించారు.ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలకు ఇది పరాకాష్ఠ అని విమర్శించారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.
తెలుగువారిని కాదని ఉత్తరాది వారికి ఈఓ పోస్టు కట్టబెట్టడంలో అంతర్యం ఏంటో ప్రభుత్వం చెప్పాలన్నారు.మాజీ ఈఓ సాంబశివరావు అద్భుతంగా పనిచేశారని కొనియాడారు.
ఆయనను మార్చడం సరికాదన్నారు.
తెలుగురాని వారిని టీటీడీ ఉన్నత పదవిలో నియమిస్తే ఇబ్బందులు తప్పవన్నారు.కీలక నిర్ణయాలు తీసుకొనేటప్పుడు ఆగమానికి సంబంధించి సమస్యలు వస్తాయన్నారు.ఉత్తర ప్రాంతం ఆగమాలతో సంబంధం లేకుండా భక్తి ఉంటుందని తెలిపారు. టీటీడీ నూతన ఈఓ నియామకంపై కోర్టుకు వెళతామని స్పష్టం చేశారు.
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కు కొత్త ఈవోగా ఐఏఎస్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్ ఏపీ ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే.