పందుల కోసం చెన్నై నుండి ప్రత్యేక సిబ్బంది... విజయవాడలో స్పెషల్ డ్రైవ్

By Arun Kumar PFirst Published Jun 15, 2021, 4:52 PM IST
Highlights

విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ హెల్త్ అధికారి రవిచంద్ నేత్రుత్వంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టి బెజవాడ వ్యాప్తంగా పందుల కోసం జల్లెడ పట్టారు. 

 విజయవాడ నగర ప్రజలకు పెద్ద సమస్యగా మారిన పందుల ఏరివేతకు కార్పోరేషన్ అధికారులు ప్రత్యేక చర్యలు ప్రారంభించారు. పందులను పట్టడంతో అనుభవమున్న 20 మందిని చెన్నై నుంచి తీసుకువచ్చి వారి సాయంతో ఏరివేత కార్యక్రమాన్ని చేపట్టారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ హెల్త్ అధికారి రవిచంద్ నేత్రుత్వంలో డ్రైవ్ చేపట్టి బెజవాడ వ్యాప్తంగా జల్లెడ పట్టారు. 

పందుల వలన నగర ప్రజలు పడుతున్న ఇబ్బందుల ద్రుష్ట్యా పందుల ఏరివేత చేపడుతున్నామన్న విఎంసి అధికారులు తెలిపారు. కార్పొరేషన్ పరిధిలో 3 వేలకు పైగా పందులు ఉన్నట్లు సమాచారం వుందని... వాటన్నింటిని పట్టుకుంటామన్నారు. అందుకోసం వారం రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ కొనసాగిస్తామని అధికారులు వెల్లడించారు. 

ఇదిలావుంటే రాష్ట్రంలో కుక్కలు, పందులకు లైసెన్స్ తప్పనిసరి చేస్తూ గతేడాది చివర్లో వైసిపి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పందుల పెంపకందారులు, కుక్కలను పెంచుకునే వారు లైసెన్స్ లు తీసుకోవాలని ఏపి పంచాయతీ అండ్ రూరల్ డెవలప్ మెంట్ శాఖ జీవో నంబరు 693 విడుదల చేసింది.

ఇక లైసెన్స్ లేని కుక్కలను, పందులను అధికారులు పట్టుకుంటే రూ.500 ఫైన్ తో పాటు రోజుకు 250 అపరాద రుసుము విధించనున్నట్లు తెలిపారు. అధికారులు పట్టుకున్న పందులు, కుక్కల యజమానులు నిర్ధారణ కాకపోతే వాటిని వీది కుక్కలుగా పరిగణించి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయాలని స్థానిక సిబ్బందికి ఆదేశాలిచ్చారు.

కుక్కలు, పందుల లైసెన్స్ గడువు ముగిసిన 10రోజుల్లోగా వాటిని రెన్యువల్ చేసుకోవాల్సి వుంటుందన్నారు. లైసెన్స్ కావాలంటే కుక్కలకు, పందులకు హెల్త్ సర్టిఫికేట్ తీసుకోవాలని... కుక్కలకు హెల్త్ సర్టిఫికేట్, పందులకు వెటర్నరీ డాక్టర్ సర్టిఫికేట్ తప్పనిసరి చేయాలని సూచించారు.

ప్రతి గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలోని కుక్కలు, పందుల యజమానులకు టోకెన్లు జారీ చేయాలని ఆయా శాఖ అధికారులను ఆదేశించింది. ఆ టోకెన్లు పెంపుడు జంతువుల మెడలో వేసి ఎప్పుడూ వుండేలా చూడాలని సూచించారు.  
 
 


 

click me!