కారులో రాహుల్ మృతదేహం: అజ్ఞాతంలో ప్రధాన సూత్రధారి విజయ్ కుమార్

By telugu teamFirst Published Aug 20, 2021, 8:22 AM IST
Highlights

విజయవాడ మాచవరంలో కారులో హత్యకు గురైన వ్యాపారవేత్త కరణం రాహుల్ హత్య కేసులో ప్రధాన సూత్రధారి కోరాడ విజయ్ కుమార్ పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో వ్యాపారి రాహుల్ హత్య కేసులో ప్రధాన సూత్రధారిగా కోరాడ విజయ్ కుమార్ అనే వ్యక్తిని పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతను అజ్ఞాతంలోకి వెళ్లాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ హత్యతో మరో నలుగురికి కూడా సంబంధం ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. 

రాహుల్, విజయ్ కుమార్ మధ్య చోటు చేసుకున్న ఆర్థిక లావాదేవీల వివాదమే హత్యకు దారి తీసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతో తన వాటా డబ్బులు తనకు కావాలని విజయ్ కుమార్  రాహుల్ మీద ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది. రాహుల్ అందుకు సిద్ధంగా లేకపోవడంతో పథకం ప్రకారం హత్యకు ఒడిగట్టినట్లు చెబుతున్నారు. రాహుల్ హాత్యతో ఓ వివాదాస్పద వ్యాపారవేత్తకు కూడా కూడా సంబంధం ఉండవచ్చునని అంటున్నారు.  

విజయవాడలోని మాచవరం వద్ద కారులో పోలీసులు ఓ మృతదేహాన్ని గుర్తించారు. కారులోని శవమై కనిపించిన వ్యక్తిని వ్యాపారవేత్త కరణం రాహుల్ గా గుర్తించి కేసు దర్యాప్తు ప్రారంభించారు. రాహుల్ హత్యకు గురైనట్లు నిర్థారించుకున్న తర్వాత నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. కారులో దొరికిన ఆధారాలతో పోలీసులు ఆ నిర్ధారణకు వచ్చారు. 

కారులో ఉన్న తాడును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తాడుతో రాహుల్ ను హత్య చేసినట్లు పోలీసులు భావించారు. కారు షోరూం నుంచి మెకానిక్ లను రప్పించి కారు డోర్ ను పోలీసులు తెరిచారు. తొలుత కారు టైర్ విప్పి డోర్ తెరిచేందుకు ప్రయత్నించారు.  అయితే అది సాధ్యం కాకపోవడంతో మెకానిక్ లను రప్పించారు. 

click me!