మాన్సాస్ ట్రస్టు విషయంలో మాజీ మంత్రి, టీడీపీ నేత అశోక్ గజపతి రాజుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. తానేదో బాధితుడైనట్లు అశోక్ గజపతి రాజు గుండెలు బాదుకుంటున్నారని ఆయన అన్నారు.
అమరావతి: మాన్సాస్ ట్రస్టు విషయంలో మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు పూసపాటి అశోక్ గజపతిరాజుపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు విజయసాయి రెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. తానేదో బాధితుడైనట్లుగా అశోక్ గజపతి రాజు గుండెలు బాదుకుటున్నారని ఆయన అన్నారు. ట్విట్టర్ వేదికగా ఆయన అశోక్ గజపతి రాజుపై వ్యాఖ్యలు చేశారు.
మాన్సాస్ ట్రస్ట్ ఆర్థిక వ్యవహారాలపై ఫోరెన్సిక్ ఆడిట్ కు చాలా కాలం పడుతుందని, అశోక్ చట్ట విరుద్ధ చర్యలపై ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని ఆయన అన్నారు. దొంగలు ఆనవాళ్లను ఎలా చెరిపేస్తారో అధికారులకు బాగా తెలుసునని, అశోక్ ముసుగు తీసి అతని అక్రమాలను బహిర్గతం చేసే ఆధారాలు వారి కళ్ల ముందే ఉన్నాయని విజయసాయి రెడ్డి అన్నారు.
అశోక్ హయాంలో మాన్సాస్ ట్రస్టుకు వాటిల్లిన నష్టం అపారమని, ఆ నష్టాన్ని ఇంకా అంచనా వేసే పనిలో అధికారులు ఉన్నారని, ఇదే ఏ ప్రైవేట్ సంస్థలోనో జరిగితే తీవ్ర నిర్లక్ష్యం, ఉల్లంఘనలు, ఆర్ఖిక అవకతవకలకు పాల్పడిన ఆరోపణలతో అశోక్ ను పీకి పారేసేవారని ఆయన అన్నారు. అది దివాణా పాలన కదా, అడిగే దిక్కే లేదని ఆయన అన్నారు.
పూసపాటి అశోక్ గజపతి రాజు తానేదో బాధితుడైనట్లు గుండెలు బాదుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అస్తవ్యస్త పాలనతో మాన్సాస్ విద్యా సంస్థలను భ్రష్టు పట్టించిన అసమర్థుడని ఆయన అశోక్ గజపతిరాజుపై వ్యాఖ్యానించారు.
ఏళ్ల తరబడి తప్పుడు డేటా అప్ లోడ్ చేసినందుకే ప్రభుత్వం నుంచి మాన్సాస్ ఆర్థిక సాయం అందలేదని ఆయన స్పష్టం చేశారు. చైర్మన్ పదవి అశోక్ గజపతిరాజుకు అలంకారం మాత్రమే, బాధ్యత కాదని విజయసాయి రెడ్డి అన్నారు.