ఈశాన్య రాష్ట్రాలను ముంచెత్తుతున్న భారీ వర్షాలు..వరదల్లో చిక్కుకున్న AP MRO ఫ్యామిలీ!

Published : Jun 02, 2025, 06:14 AM IST
Assam floods

సారాంశం

సిక్కింలో భారీ వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి.దీంతో రహదారులన్ని మూసుకుపోయాయి.పర్యటనకు వెళ్లిన విజయనగరం తహసీల్దార్ కుటుంబం వరదల్లో చిక్కుకు పోయారు.

నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈశాన్య రాష్ట్రాల్లో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, అస్సాం రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతూ ఉండటంతో కొన్ని ప్రాంతాల్లో వరద పరిస్థితులు ఉత్కంఠ కలిగిస్తున్నాయి. సిక్కింలో అయితే వరదలు తీవ్రంగా ఉండటంతో రహదారులు మూసుకుపోయాయి, కొండచరియలు విరిగిపడుతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

1,500 మంది పర్యాటకులు…

ఈ వర్షాల ప్రభావంతో సుమారు 1,500 మంది పర్యాటకులు సిక్కింలో చిక్కుకుపోయారు. వారిలో విజయనగరం జిల్లా తహసీల్దారు కూర్మనాథ్ రావు కుటుంబం కూడా ఉంది. వేసవి సెలవుల్లో భాగంగా ఐదు రోజుల క్రితం ఆయన కుటుంబంతో కలిసి సిక్కింలోని గ్యాంగ్‌టక్ వెళ్లారు. అక్కడి నుంచి మరో 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్యాటక ప్రాంతాన్ని చూడడానికి వెళ్లిన సమయంలో విస్తారమైన వర్షాలు కురిశాయి.

వరద నీటితో…

అదే సమయంలో ప్రయాణించిన మార్గం వరద నీటితో పూర్తిగా మూసుకుపోయింది. దీంతో వారు అక్కడే ఒక హోటల్‌లో చిక్కుకుపోయారు. ప్రస్తుతం ఆ హోటల్‌లోనే వారు సురక్షితంగా ఉన్నట్టు సమాచారం. రహదారి పరిస్థితులు మెరుగయ్యాక గ్యాంగ్‌టక్‌కు తిరిగి చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.

వారికి సహాయం అందించేందుకు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్వయంగా సిక్కిం డీజీపీతో మాట్లాడారు. ఏపీ భవన్ స్పెషల్ కమిషనర్ శ్రీకాంత్ కూడా సిక్కిం అధికారులతో సంప్రదింపులు జరిపారు. ఈ చర్యలతో తహసీల్దార్ కుటుంబం సురక్షితంగా ఉండటానికి ఏర్పాట్లు జరిగాయి.

కొండచరియలు విరిగిపడే ప్రమాదం..

ఇదిలా ఉండగా, వరదలు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో రవాణా మార్గాలు నిలిచిపోయాయి. కొండచరియలు విరిగిపడే ప్రమాదం కూడా ఉన్న నేపథ్యంలో స్థానిక అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ అధికారులు సూచిస్తున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Minister Nara Lokesh Powerful Speech in Karnataka | Sindhanur Public Meeting | Asianet News Telugu
AP Weather Update: ఏపీలో సూర్యుడి ప్రతాపం.. బయటకు రాలేక అల్లాడిపోతున్న జనం | Asianet News Telugu