ఆ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు... అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరిక (వీడియో)

By Arun Kumar PFirst Published Jul 21, 2021, 3:52 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ లో ఇవాళ, రేపు పలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. 

వాయువ్య బంగాళఖాతం పరిసర ప్రాంతాల్లో 3.1 నుండి 7.6 కిలోమీటర్ల మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు ఎస్. స్టెల్లా తెలిపారు. ఇది నైరుతి దిశగా వంగి వుంటుదని... దీని ప్రభావంతో రాగల 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడనుందని తెలిపారు. అలాగే పశ్చిమ, వాయువ్య గాలులు కోస్తాంద్ర మీదుగా వీస్తున్నాయని... దీని కారణంగా ఈరోజు, రేపు(బుధ, గురువారం) ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. 

ముఖ్యంగా విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విజయనగరం, క్రిష్ణా జిల్లాలో ఒకటి రెండు చోట్ల భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం వుందని హెచ్చరించారు.  విశాఖ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలొ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని హెచ్చరించారు. ఇక ప్రకాశం, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని స్టెల్లా వెల్లడించారు. 

వీడియో

ఇక ఈరోజు, రేపు రాయలసీమలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు  కురుస్తాయన్నారు. కర్నూల్, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. కోస్తాంద్ర తీరం వెంబడి  గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు హెచ్చరించారు. కాబట్టి మత్స్యకారులు అప్రమత్తంగా వుండాలని... సముద్రంలో వేటకు వెళ్లరాదని సూచించారు. 

click me!