నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో అధికార తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. టీడీపీ సీనియర్ నేత, సూళ్ళూరు పేట మున్సిపల్ కౌన్సిలర్ వేనాటి సుమంత్ రెడ్డి గురువారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ఆయన ప్రకటించారు. సూళ్ళూరుపేటలో పాదయాత్ర చేస్తున్న వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని సుమంత్ బుధవారం కలిసిన సంగతి అందరకీ తెలిసిందే. ఎన్టీఆర్ టీడీపీని స్థాపించినప్పటి నుంచి తమ కుటుంబం పార్టీలోనే ఉందని అయితే పార్టీలో తమకు ఎదురవుతున్న అవమానాలు భరించలేకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. సూళ్లూరుపేటలో తాగునీటిని కూడా ఇప్పించలేకపోయామని సుమంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. సుమంత్ రెడ్డి తండ్రి వేనాటి రామచంద్రారెడ్డి జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ గా ఉన్నారు. కొడుకు వరస చూస్తుంటే త్వరలోనే తండ్రి కూడా టిడిపిరి వదిలేసేలా ఉన్నారు.