సీఐడి చీఫ్ సునీల్ కుమార్ పై దేశద్రోహం కేసు: గవర్నర్ కు వర్ల లేఖ

By Arun Kumar PFirst Published Jun 22, 2021, 10:52 AM IST
Highlights

సీఐడి అధికారి సునీల్ కుమార్ పై దేశద్రోహం కేసు పెట్టాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వర్ల రామయ్య కోరారు.  

విజయవాడ: సిఐడి అధికారి పి.వి సునీల్ కుమార్, ఆడిషినల్  ఎస్పీ మోకా సత్తిబాబులపై చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలంటూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వర్ల రామయ్య కోరారు. ఈ మేరకు గవర్నర్ కు రామయ్య ఓ లేఖ రాశారు. 

''ఉగ్రవాదులను ఆదర్శంగా తీసుకోవాలంటూ దళిత యువతను ప్రోత్సహిస్తున్న పి.వి సునీల్ కుమార్, అడిషనల్ ఎస్పీ మోకా సత్తిబాబులపై  క్రిమినల్ చర్య తీసుకునేలా ఆదేశించండి. ఇప్పటికే వీరిద్దరిపై చర్య తీసుకోవాలని డిజిపి సవాంగ్ కు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం. అందువల్లే ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకువస్తున్నా'' అన్నారు వర్ల రామయ్య. 

''తాను స్థాపించిన ఏఐఎమ్ అనే సంస్థ ద్వారా భారతీయ సంస్కృతిని కించపరుస్తూ ఉగ్రవాదులను ఆదర్శంగా చూపిస్తున్నారు. కాబట్టి సివిల్ కాండక్ట్ రూల్స్ ను ఉల్లంఘించిన ఈ ఇద్దరు అధికారులపై చర్య తీసుకోవాలి. ఇరువర్గాల మధ్య వైషమ్యం పెంచుతున్న పి.వి సునీల్ కుమార్ పై చర్య తీసుకోవాలి. ఉగ్రవాదుల చర్యను సమర్ధించిన వీరిపై రాజద్రోహం నేరం కింద కేసు పెట్టాలి'' అని గవర్నర్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు వర్ల రామయ్య. 

read more  నేరచరితులకు పదవుల కోసం... సతీసమేతంగా గవర్నర్ వద్దకా!: వర్ల సీరియస్

ఏపీ సిఐడి అడిషనల్ డైరెక్టర్ జనరల్ పి.వి సునీల్ కుమార్, కృష్ణా జిల్లా అడిషనల్ ఎస్పీ మోకా సత్తిబాబులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ గతంలోనే రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్ కు వర్ల ఓ లేఖ రాశారు. భారత సాంప్రదాయాన్ని కించపరుస్తూ, బ్రిటిష్ వారిని స్తుతించిన సిఐడి డిజి సునీల్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని సూచించారు. ఓ స్వచ్ఛంద సంస్థను స్థాపించి ఉగ్రవాదరీతిలో ఆత్మార్పణకు సిద్ధపడాలని దళిత యువతను ఉద్రేకపరుస్తున్నాడని ఆరోపించారు. సమాజంలో రెండు వర్గాల మధ్య వైషమ్యాలు రేకెత్తించే రీతిలో ఉపన్యాసాలిస్తున్న సునీల్ కుమార్ కు కేసు నమోదు చేయాలని వర్ల డిజిపిని కోరారు. 

ఇక అమెరికాలో వరల్డ్  ట్రేడ్ సెంటర్ ను కూల్చిన ఉగ్రవాదులను ఆదర్శంగా తీసుకోవాలని దళిత యువతను ఉద్రేకపరుస్తున్న కృష్ణా జిల్లా అడిషనల్ ఎస్పీ మోకా సత్తిబాబును కూడా శిక్షించాలని వర్ల డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులుగా వుంటూ, సర్వీస్ కాండక్ట్ రూల్స్ ను ఉల్లంఘించిన ఈ ఇద్దరు అధికారులపై వెంటనే చర్య తీసుకోవాలని వర్ల రామయ్య కోరారు. భారత శిక్షాస్మృతి 124(A)ప్రకారం వీరిపై రాజద్రోహ నేరం కేసు రిజిస్టర్ చేసి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని వర్ల డిజిపికి సూచించారు. అంతేకాకుండా 153(A),295(A) ఐపిసి ప్రకారం కూడా వీరిద్దరిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిజిపికి రాసిన లేఖలో వర్ల రామయ్య పేర్కొన్నారు.

 


 

click me!