గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి ప్రభుత్వం పనే.. ఎస్పీకి ముందే తెలుసు : వర్ల రామయ్య వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Feb 25, 2023, 05:19 PM IST
గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి ప్రభుత్వం పనే.. ఎస్పీకి ముందే తెలుసు : వర్ల రామయ్య వ్యాఖ్యలు

సారాంశం

గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి చేస్తారని జిల్లా ఎస్పీకి ముందే తెలుసునని అన్నారు ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య. టీడీపీ కార్యాలయంపై దాడి వెనుక ప్రభుత్వం వుందన్నారు రామయ్య. 

ఇటీవల గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి వెనుక ప్రభుత్వం వుందన్నారు ఆ పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య. శనివారం గన్నవరంలో దాడికి గురైన టీడీపీ కార్యాలయాలన్ని ఆయన పరిశీలించారు. అనంతరం వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ కార్యాలయంపై దాడి జరుగుతుందని ఎస్పీ, ఇతర పోలీస్ ఉన్నతాధికారులకు ముందే తెలుసునని ఆయన ఆరోపించారు. పోస్టింగ్ ఇవ్వరన్న భయంతోనే జిల్లా ఎస్పీ అన్ని విషయాలు గోప్యంగా వుంచుతున్నారని వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయాన్ని అడ్డుకోలేరని ఆయన తేల్చిచెప్పారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అరాచకాలు , అవినీతితోనే వైసీపీ పాలన సాగుతోందని వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. 

అంతకుముందు సోమవారం వైసీపీ కార్యకర్తల దాడిలో ధ్వంసమైన గన్నవరం టీడీపీ కార్యాలయాన్ని చంద్రబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పక్కా ప్రణాళిక ప్రకారమే గన్నవరంలోని తమ కార్యాలయంపై దాడులు జరిగాయని ఆరోపించారు. కొంతమంది పోలీసుల వల్లే సమస్యలు వస్తున్నాయని చంద్రబాబు ఆరోపించారు. తనను పర్యటించొద్దు అనడానికి పోలీసులు ఎవరు.. బెదిరిస్తే పారిపోతామా అని ఆయన ప్రశ్నించారు. జగన్‌ను నమ్ముకున్న ఎందరో అధికారులు జైలుకు వెళ్లారని.. అందరికీ వడ్డీతో సహా చెల్లిస్తామని చంద్రబాబు హెచ్చరించారు. దొంగలాటలు వద్దు.. లగ్నం పెట్టుకుందాం, తాడోపేడో తేల్చుకుందామని, దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా జగన్ రావాలని చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 

Also Read: జగన్ రాడు.. నేనూ, వంశీ రెడీ .. రాజీనామా చేసి రా.. కొట్టుకుందాం : చంద్రబాబుకు కొడాలి నాని సవాల్

కాగా.. కృష్ణా జిల్లా టిడిపి కార్యాలయం వద్ద చోటుచేసుకున్న ఘర్షణల కేసులో టిడిపి అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాంతో సహా 15 మందిని పోలీసులు అరెస్ట్ చేసారు. టిడిపి కార్యాలయంపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వర్గీయులు, వైసిపి కార్యకర్తలు దాడికి పాల్పడినట్లు తెలిసి పట్టాభి అక్కడి వెళ్లారు. ఈ క్రమంలోనే దాడి సమయంలో పోలీసుల తీరును నిరసిస్తూ డిజిపి కార్యాలయానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పట్టాభితో పాటు మరికొందరు టిడిపి నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే పట్టాభిని ఎక్కడికి తరలించారో తెలియకపోవడంతో మంగళవారం గందరగోళం నెలకొంది. పట్టాభికి ప్రాణహాని వుందంటూ ఆయన భార్య ఆందోళనకు దింగింది. ఈ క్రమంలో సాయంత్రం గన్నవరం కోర్టులో పట్టాభిని హాజరుపర్చగా తనపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్లు న్యాయమూర్తికి తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

ఇఫ్తార్ విందులో పాల్గొన్న జగన్ | YS Jagan Attends Iftar Dinner | Asianet News Telugu
దివ్యాంగులతో టికెట్ తీసుకొని బస్సులో ప్రయాణించిన సీఎం | Divyang Shakti Scheme | Asianet News Telugu