వరలక్ష్మి హత్య కేసు : రామునాయుడిని బెదిరించిన ఇద్దరి అరెస్ట్..

By AN TeluguFirst Published Nov 7, 2020, 1:18 PM IST
Highlights

విశాఖపట్నంలో కలకలం రేపిన ఇంటర్మీడియట్‌ విద్యార్థిని వరలక్ష్మి హత్య కేసులో గాజువాక పోలీసులు మరో ఇద్దరు నిందితులను శుక్రవారం అరెస్టు చేశారు.  గాజువాక శ్రీనగర్‌కు చెందిన వరలక్ష్మి ప్రేమోన్మాది అఖిల్‌సాయి వెంకట్‌ చేతిలో హత్యకు గురైన విషయం తెలిసిందే. 

విశాఖపట్నంలో కలకలం రేపిన ఇంటర్మీడియట్‌ విద్యార్థిని వరలక్ష్మి హత్య కేసులో గాజువాక పోలీసులు మరో ఇద్దరు నిందితులను శుక్రవారం అరెస్టు చేశారు.  గాజువాక శ్రీనగర్‌కు చెందిన వరలక్ష్మి ప్రేమోన్మాది అఖిల్‌సాయి వెంకట్‌ చేతిలో హత్యకు గురైన విషయం తెలిసిందే. 

ఈ కేసును ఛాలెంజింగా తీసుకున్న పోలీసులు సంఘటన జరిగిన రోజే నిందితుడు అఖిల్‌సాయి వెంకట్‌ను అరెస్టు చేశారు. అయితే ఈ కేసులో తాజాగా కొప్పెర్ల హరి రామకృష్ణరాజు, తంగెళ్ల చిన్న అప్పన్న అనే మరో ఇద్దరిని కూడా అరెస్టు చేశారు. 

వరలక్ష్మితో చనువుగా ఉంటున్నాడనే కారణంతో ఆమె సోదరుడు ఇటీవల వంగపండు రామునాయుడు అనే వ్యక్తితో గొడవపడ్డాడు. మరోసారి తన చెల్లెలతో మాట్లాడినట్టు తెలిస్తే బాగుండదని హెచ్చరించాడు. రెండేళ్ల క్రితం హత్యకు గురైన రౌడీషీటర్‌ కుమారుడు హరి రామకృష్ణరాజుతో ఈ విషయాన్ని చెప్పాడు. 

దీన్ని అదనుగా తీసుకున్న హరి ఇటీవల రామునాయుడుకు ఫోన్‌ చేసి షీలానగర్‌ వచ్చి తనను కలవాలని, లేనిపక్షంలో ఇబ్బంది పడతావని హెచ్చరించాడు. అతడి ని కలిసిన రామునాయుడుని రూ.10వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. 

తాను అడిగిన డబ్బులు ఇస్తే ఎవరినుంచీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తానని చెప్పాడు. దీంతో రాము నాయుడు అతడికి, అతని స్నేహితుడు చిన్న అప్పన్నకు ఎనిమిదివేల రూపాయల వరకు ఇచ్చాడు. 

వరలక్ష్మి హత్య కేసులో విచారణ ప్రారంభించిన పోలీసులకు రామునాయుడు ఈ విషయాలు చెప్పడంతో హరి, చిన్న అప్పన్నలను కూడా అరెస్టు చేసినట్టు గాజువాక సీఐ మల్లేశ్వరరావు తెలిపారు. ఈ కేసులో మొత్తం ముగ్గురు నిందితులను అరెస్టు చేశామని ఎస్‌ఐ గణేష్‌ తెలిపారు. 

click me!