నదుల అనుసంధానంపై విజయసాయి ప్రశ్న: ముసాయిదా సిద్ధమైందన్న కేంద్ర మంత్రి

By Siva KodatiFirst Published Feb 3, 2020, 5:42 PM IST
Highlights

గోదావరి నుంచి కృష్ణ, కృష్ణ నుంచి పెన్నా, పెన్నా నుంచి కావేరీ నదులకు నీటి మళ్ళింపు కోసం నేషనల్‌ వాటర్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యుడీఏ) ముసాయిదా ప్రణాళికను రూపొందించినట్లు కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ సోమవారం రాజ్యసభలో వెల్లడించారు. 

గోదావరి నుంచి కృష్ణ, కృష్ణ నుంచి పెన్నా, పెన్నా నుంచి కావేరీ నదులకు నీటి మళ్ళింపు కోసం నేషనల్‌ వాటర్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యుడీఏ) ముసాయిదా ప్రణాళికను రూపొందించినట్లు కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ సోమవారం రాజ్యసభలో వెల్లడించారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు.

దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటున్న రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలను ఆదుకునేందుకు గోదావరి నది బేసిన్‌ నుంచి కృష్ణా నది బేసిన్‌కు నీరు మళ్ళించే అవకాశాలను పరిశీలించివలసిందిగా కోరుతూ గత ఏడాది ఆగస్టులో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారని మంత్రి చెప్పారు.

Also Read:జగన్ పై దూకుడు: పవన్ కల్యాణ్ చేతులు కట్టేసిన బిజెపి పొత్తు

గోదావరి, కృష్ణా, పెన్నా, కావేరీ నదుల అనుసంధానంపై సవివరమైన ప్రాజెక్ట్‌ నివేదికను రూపొందించే బాధ్యతను ఎన్‌డబ్ల్యుడీఏకు అప్పగించినట్లు గజేంద్ర‌సింగ్ తెలిపారు. ఆ సంస్థ సిద్ధం చేసిన ముసాయిదా డీపీఆర్‌పై  తమ అభిప్రాయాలను తెలపవలసిందిగా కోరుతూ సంబంధిత రాష్ట్రాలకు పంపించినట్లు షెకావత్‌ చెప్పారు.

గోదావరి - కావేరీ లింక్‌ ప్రాజెక్ట్‌లో ప్రధానంగా మూడు లింక్‌లు ఉంటాయి. అవి గోదావరి (ఇంచంపల్లి లేదా జానంపేట), కృష్ణా (నాగార్జునసాగర్‌) లింక్‌, కృష్ణా (నాగార్జునసాగర్‌) పెన్నా (సోమశిల) లింక్‌, పెన్నా (సోమశిల), కావేరీ (గ్రాండ్‌ ఆనకట్ట) లింక్‌ అని మంత్రి వెల్లడించారు.

ఈ లింక్‌ ప్రాజెక్ట్‌ల ద్వారా నిరుపయోగంగా పోతున్న 247 టీఎంసీల నీటిని సద్వినియోగం చేసుకునే వీలు కలుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గోదావరి-కృష్ణా లింక్‌ ప్రాజెక్ట్‌ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో 3.45 లక్షల నుంచి 5.04 లక్షల హెక్టార్ల భూములకు ఏటా సాగునీటి వసతి కల్పించవచ్చని చెప్పారు.

Also Read:ఏపీ శాసనమండలి సెలెక్ట్ కమిటీ: పేర్లిచ్చిన టీడీపీ, బీజేపీ, పీడీఎఫ్

అలాగే నాగార్జునసాగర్‌ కుడి, ఎడమ కాల్వల కింద ఉన్న ఆయకట్టును స్థిరీకరించవచ్చు. నదుల లింకింగ్‌ ప్రాజెక్ట్‌పై సంబంధిత రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధించిన అనంతరం తుది డీపీఆర్‌ను రూపొందించి, చట్టపరమైన అన్ని అనుమతులు పొందిన తర్వాత ప్రాజెక్ట్‌ పనులు మొదలవుతాయని గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు.

click me!