
నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని కుక్కలు, పందులు పీక్కుతినేశాయి. ఈ ఘటన స్థానిక ప్రజలను కలచివేసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే... సుమారు 50 ఏళ్ల వయస్సున్న ఓ మహిళ అనారోగ్యం కారణంగా చికిత్స నిమిత్తం జీజీహెచ్కు మూడురోజుల క్రితం వచ్చింది. ఆమె ఆస్పత్రి భవనం ఎదురుగా ఉన్న ప్రాంగణంలోని చెట్ల కింద సేద తీరేది. ఆమెను చాలా మంది చూశారు కానీ.. ఎవరూ ఆమె గురించి ఆరా తీయలేదు. కాగా.. ఇటీవల ఆమె కన్నుమూసింది. చెట్టుకింద నిద్రపోతోందని అందరూ భావించారు.
కాగా.. గురువారం ఉదయం శానిటేషన్ సిబ్బంది చూడగా ఆమె కాళ్లను కుక్కలు, పందులు పీక్కు తినేసి ఉన్నాయి. మృతదేహంపై దుస్తులు కూడా లేవు. శానిటేషన్ సిబ్బంది ఆస్పత్రి అధికారులకు విషయాన్ని తెలియజేశారు. దీంతో అధికారులు అక్కడికి వచ్చి మృతదేహాన్ని చూసి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు వచ్చి మృతదేహాన్ని చూసి కేసు నమోదు చేసుకున్న అనంతరం మార్చురీకి తరలించారు.
ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందనే విమర్శలున్నాయి. కొంతమంది వృద్ధ అనాథలు ఇక్కడి ప్రాంగణంలోకి వచ్చి మృతి చెందడం వంటి ఘటనలు ఇటీవల ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయని చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.