విగ్రహం దిమ్మెను ఢీకొట్టిన కారు: తెగి రోడ్డుపై పడిన యువకుడి తల

By telugu teamFirst Published Apr 19, 2021, 6:50 AM IST
Highlights

గుంటూరులో మితిమీరిన వేగంతో ఓ కారు రోడ్డు పక్కన విగ్రహం దిమ్మెను ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు మరణించారు. ఓ యువకుడి తల తెగి రోడ్డు మీద పడింది. అతి వేగం కారణంగానే ఈ ప్రమాదం సంభవించింది.

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరులో అతి ఘోరమైన కారు ప్రమాదం చోటు చేసుకుంది. మితిమీరిన వేగం కారణంగా ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. రెండు కుటుంబాల్లో విషాదం చోటు చేసుకుంది. కారు అతి వేగంతో విగ్రహం దిమ్మెను ఢీకొట్టడంతో ఇద్దరు మరణించారు. ఓ యువకుడి తల తెగి రోడ్డుపై పడింది. దీన్ని బట్టి కారు ఎంత వేగంతో దిమ్మెను ఢీకొట్టిందో అర్థమవుతోంది. 

గుంటూరు జిల్లా కాకునూరు మండలం రేటూరు గ్రామానికి చెందిన పఠాన్ సాదిక్ (18) గుంటూరు రూరల్ మండలంలోని వెంగళాయపాలెంలో బంధువులు ఇంటిలో జరిగిన పెళ్లికి మూడు రోజుల క్రితం వచ్చాడు. వివాహం తర్వాత కార్యక్రమాలు చూసుకుని ఆదివారం సాయంత్రం తిరిగి కాకునూరు వెళ్లాలని అనుకున్నాడు. ఈలోగా మధ్యాహ్నం బంధువుల ఇంట్లోకి కొన్ని వస్తువులు అవసరమయ్యాయి. 

వాటిని తెచ్చేందుకు బేగ్ ఖాదర్ నాగుల్ బాషా (15), పఠాన్ లాలు (19)లతో కలిసి పఠాన్ సాదిక్ కారులో బయలుదేరాడు. పఠాన్ లాలూ కారును నడపసాగాడు. అతి వేగంతో వెళ్తూ వెంగళాయపాలెంలోని జగ్జీవన్ రామ్ సెంటర్ రోడ్డు పక్కన ఉన్న విగ్రహం దిమ్మెను ఢీకొట్టాడు.

ప్రమాదంలో ఖాదర్ నాగుల్ బాషా, సాదిక్ లు అక్కడిక్కడే మరణించారు. లాలూకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఓ యువకుడి తల తెగి రోడ్డుపై పడింది. ప్రమాదంలో మరణించిన నాగుల్ బాషా తండ్రి మహ్మద్ బేగ్.  అతని ముగ్గురు కుమారుల్లో రెండోవాడైన బాషా 9వ తరగతి చదవుతున్నాడు. 

కారును నడిపిన లాలూకు గతంలో ఇటువంటి ప్రమాదమే జరిగి కాలును కోల్పోయాడని చెబుతున్నారు. జైపూర్ ఫుట్ తో అతను కారును నడిపినట్లు స్థానికులు చెబుతున్నారు.

click me!