Tirumala Darshan Tickets: శ్రీవారి సర్వదర్శనం టికెట్లు విడుదల.. 15 నిమిషాల్లోనే హాట్ కేకుల్లా బుక్కైన టికెట్లు

By Sumanth KanukulaFirst Published Dec 27, 2021, 10:40 AM IST
Highlights

కరోనా నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupathi Devasthanams) శ్రీవారి దర్శన టికెట్లను (darshan tickets) ఆన్‌లైన్‌లో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా జనవరి నెలకు సంబందిచిన సర్వదర్శనం టికెట్లను టీటీడీ విడుదల చేయగా.... భక్తుల నుంచి భారీగా స్పందన వచ్చింది. శ్రీవారి దర్శన టికెట్లు హాట్ కేకుల్లా బుక్కయ్యాయి.

తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటుగా, విదేశాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. అయితే కరోనా నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupathi Devasthanams) శ్రీవారి దర్శనానికి పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తుంది. అంతేకాకుండా కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకుంది. ఈ క్రమంలోనే శ్రీవారి దర్శన టికెట్లను (darshan tickets) ఆన్‌లైన్‌లో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా జనవరి నెలకు సంబందిచిన సర్వదర్శనం టికెట్లను టీటీడీ విడుదల చేసింది. ఆన్‌లైన్‌లో టికెట్లను భక్తులకు అందుబాటులో ఉంచింది. 

ఉదయం 9 గంటలకు శ్రీవారి సర్వదర్శనం టోకెన్లను (Sarva Darshan tokens) ఆన్‌లైన్‌లో ఉంచగా.. భక్తుల నుంచి భారీగా స్పందన వచ్చింది. శ్రీవారి దర్శన టికెట్లు హాట్ కేకుల్లా బుక్కయ్యాయి. కేవలం 15 నిమిషాల్లో పూర్తిగా టికెట్ల బుకింగ్ జరిగిపోయింది. అయితే ఈ విషయం తెలియని చాలా మంది భక్తులు శ్రీవారి భక్తులు టీటీడీ వెబ్‌సైట్‌కు లాటిన్ అవుతున్నారు. టికెట్లు బుకింగ్ అప్పటికే పూర్తి కావడంతో తీవ్ర నిరాశ చెందుతున్నారు. 

ఇక, జనవరి నెలకు సంబంధించి టీటీడీ రోజులకు 10 వేల చొప్పున 2.60 లక్షల టోకెన్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 13 నుంచి 22 వరకూ రోజుకు 5 వేల చొప్పున టోకెన్లు విడుదల చేశారు. మిగిలిన రోజుల్లో రోజుకు 10 వేల చొప్పున టికెట్లను టీటీడీ ఆన్‌లైన్‌లో ఉంచింది. 

ఇక, జనవరి నెలకు సంబంధించి శ్రీవారి రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ శుక్రవారం విడుదల చేసింది. మొత్తం 4.60 లక్షల టికెట్లు విడుదల చేసింది. శ్రీవారి భక్తులు కొద్ది గంటల వ్యవధిలోనే వీటిని కొనుగోలు చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1న టీటీడీ 20 వేల టికెట్లను విడుదల చేసింది. అలాగే వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 13 నుంచి 22 వరకు రోజున టికెట్లను 20 వేలకు పెంచారు. జనవరిలో మిగిలిన రోజుల్లో రోజుకు 12 వేల చొప్పున టికెట్లను అందుబాటులో ఉంచారు. వీటిని భక్తులు కొద్ది గంటల్లోనే కొనుగోలు చేశారు. 

కోవిడ్ నిబంధనలు తప్పనిసరి..
శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు కచ్చితంగా కోవిడ్ నిబంధనలు పాటించాల్సిందే. దర్శనానికి వచ్చే భక్తులు కోవిడ్ రెండు డోసుల వ్యాక్సిన్ సర్టిఫికేట్ లేదా 48 గంటల ముందు చేసుకున్న కోవిడ్ టెస్ట్ సర్టిఫికేట్ తప్పనిసరిగా అధికారులకు చూపించాలి. 

click me!