world environment day : తిరుమలలో పర్యావరణ పరిరక్షణకు మరిన్ని చర్యలు: టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

Siva Kodati |  
Published : Jun 05, 2022, 03:31 PM IST
world environment day : తిరుమలలో పర్యావరణ పరిరక్షణకు మరిన్ని చర్యలు: టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

సారాంశం

తిరుమలలో పర్యావరణ పరిరక్షణకు అనేక చర్యలు తీసుకున్నామని వెల్లడించారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. ప్లాస్టిక్ బాటిళ్లు నిషేధించామని.. త్వరలో కొండపైకి విద్యుత్ బస్సులు నడుపుతామని ఆయన తెలిపారు. 

రానున్న రోజుల్లో తిరుమల తిరుపతి పరిసరాల్లో మరిన్ని పర్యావరణ హితమైన కార్యక్రమాలు చేపడతామన్నారు టీటీడీ (ttd) ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (yv subba reddy) . ఆదివారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన మాట్లాడుతూ... ప్రపంచ పర్యావరణ దినోత్సవం (world environment day) సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. గ్లోబల్ వార్మింగ్ అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రకృతిని కాపాడుకుంటేనే మానవాళి మనుగడ సాధ్యం అవుతుందని సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

గత మూడేళ్లలో టీటీడీ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ దిశగా అనేక నిర్ణయాలు తీసుకున్నామని వెల్లడించారు. శ్రీ వేంకటేశ్వరస్వామి వారు కొలువైన తిరుమల క్షేత్రాన్ని కాలుష్య రహిత క్షేత్రంగా తీర్చిదిద్దడానికి అనేక చర్యలు తీసుకున్నామని సుబ్బారెడ్డి చెప్పారు. ఇందులో భాగంగా తిరుమలలో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించామని ఆయన గుర్తుచేశారు. కొండపై ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల అమ్మకాన్ని రెండేళ్ల కిందటే నిషేధించినట్టు తెలిపారు. తిరుమలలో 10 వేల మొక్కలు నాటి వాటి సంరక్షణకు చర్యలు తీసుకున్నామని ... విద్యుత్ ఆధారిత వాహనాల వినియోగం ప్రారంభించామని సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. త్వరలోనే ఆర్టీసీ 100 విద్యుత్ బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తోందని ఆయన తెలిపారు.

Also Read:తిరుమల కొండపై ప్లాస్టిక్‌ నిషేధం .. రేపటి నుంచే అమల్లోకి : టీటీడీ సంచలన నిర్ణయం

శ్రీవారి ప్రసాదాల కౌంటర్లలో ప్లాస్టిక్ బ్యాగ్ లు నిషేధించామని, వాటి స్థానంలో జూట్, పర్యావరణానికి హాని కలిగించని బ్యాగ్ లు అందుబాటులో ఉంచామని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని పర్యావరణ హిత నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తామని టీటీడీ ఛైర్మన్ పేర్కొన్నారు. రైతు సాధికార సంస్థతో ఒప్పందం చేసుకుని ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు పండించిన శెనగలు, బియ్యం, బెల్లం టీటీడీ కొనుగోలు చేస్తోందని ఆయన వివరించారు.

కాగా.. ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు (టీటీడీ) (tirumala tirupati devasthanam) సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. జూన్ 1 నుంచి తిరుమలలో పూర్తి స్థాయిలో ప్లాస్టిక్‌పై నిషేధం (ban on plastic)  విధించింది. అలిపిరి టోల్‌గేట్ (alipiri toll gate) వద్ద తనిఖీలు నిర్వహిస్తామని... ప్లాస్టిక్ రహిత వస్తువులనే కొండపైకి అనుమతిస్తామని టీటీడీ ప్రకటించింది. దుకాణదారులు సైతం ప్లాస్టిక్‌కి ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. 

PREV
click me!

Recommended Stories

RK Roja on CM Chandrababu: రేవంత్ రెడ్డి కి ఎందుకు భయపడుతున్నావ్? | YSRCP | Asianet News Telugu
చంద్రబాబు, పవన్‌పై 420 కేసులు పెట్టాలి: RK Roja Strong Comments on TDP, JSP | Asianet News Telugu