కరోనా వైరస్.. భక్తులు భయపడొద్దు: టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

By Siva KodatiFirst Published Mar 5, 2020, 7:12 PM IST
Highlights

భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో పాటు హైదరాబాద్‌లోనూ కరోనా కలకలం రేగుతున్న నేపథ్యంలో ప్రతినిత్యం లక్షలాది మంది భక్తులు సంచరించే తిరుమల తిరుపతి దేవస్థానం అప్రమత్తమైంది.

భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో పాటు హైదరాబాద్‌లోనూ కరోనా కలకలం రేగుతున్న నేపథ్యంలో ప్రతినిత్యం లక్షలాది మంది భక్తులు సంచరించే తిరుమల తిరుపతి దేవస్థానం అప్రమత్తమైంది.

కరోనా వ్యాపించకుండా తిరుమలలో ముందు జాగ్రత్తలు తీసుకున్నామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు భక్తులకు మాస్కులు పంపిణీ చేస్తున్నామని, తిరుమలలో వైద్య బృందాన్ని అందుబాటులో ఉంచామని వైవీ చెప్పారు.

Also Read:కరోనాపై భయాలు వద్దు, పుకార్లు నమ్మొద్దు.. అన్ని ఏర్పాట్లు చేశాం: ఆళ్లనాని

ప్రపంచంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రతి జిల్లాలోనూ ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేయడంతో పాటు ముందస్తు చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎం అధికారులను ఆదేశించారని వైవీ చెప్పారు.

చల్లదనం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని అయితే తిరుమలలో గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రత పెరిగిందని సుబ్బారెడ్డి పేర్కొన్నారు. 

అంతకుముందు ఆంధ్రప్రదేశ్ ప్రజాలెవరూ కరోన వైరస్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని. వైరస్‌పై ముఖ్యమంత్రి ప్రతీ రోజూ సమీక్షలు జరుపుతున్నారరని ఆయన తెలిపారు. 

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అనుక్షణం అప్రమత్తంగా ఉందని, పోర్టుల్లోనూ.. ఎయిర్‌పోర్టుల్లోనూ అనుమానితుల నుంచి నమూనాలు సేకరించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని మంత్రి తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా ముందస్తు జాగ్రత్తగా 8 ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేశామని.. తాజాగా కేంద్రం సూచనల మేరకు ప్రత్యేకంగా ఐసోలేషన్ రూములు కూడా ఏర్పాటు చేశామని ఆళ్లనాని వెల్లడించారు.

ఎక్కడికక్కడ మాస్కులు..వెంటిలేటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కరోనాపై కొన్ని నిరాధారమైన వార్తలు వస్తున్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నాని స్పష్టం చేశారు.

Also Read:నా నుండి భారత్ కు కరోనా వైరస్... ఏపిలో హై అలర్డ్...: మంత్రి ఆళ్ల నాని

ఒకవేళ కరోనా వైరస్ వస్తే ఎలా ఎదుర్కోవాలి అన్న దానిపై కేంద్రం ఈ నెల 6న వర్క్‌షాప్ నిర్వహిస్తోందని.. దీని ఆధారంగా రాష్ట్ర స్థాయిలో ఒక సమావేశం నిర్వహిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.

విశాఖ, తిరుపతి, కర్నూలు, కాకినాడ, నెల్లూరు లాంటి చోట్ల ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రజల్లో కరోనా వైరస్ పట్ల అవగాహన కల్పించేందుకు కరపత్రాలు పంచడంతో పాటు ఏఎన్ఎంల ద్వారా కూడా అన్ని ప్రాంతాల్లో ప్రచారం చేస్తామని మంత్రి చెప్పారు.

click me!