
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ కేబినెట్ భేటీ అంశం ఉత్కంఠ రేపుతోంది. కేబినెట్ సమావేశాన్ని ప్రెస్టేజియస్ ఇష్యూగా తీసుకున్న చంద్రబాబు ఎలాగైనా కేబినెట్ మీటింగ్ నిర్వహించాలని యోచిస్తున్నారు.
ఈనెల 10న కేబినెట్ మీటింగ్ నిర్వహించాలని భావించినప్పటికీ ఈసీ అనుమతి ఆలస్యం అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో 14కు వాయిదా వేశారు. అయితే ఏపీ కేబినెట్ పై సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం అభ్యంతరం వ్యక్తం చేశారు.
కేంద్ర ఎన్నికల కమిషన్ అనుమతితో కేబినెట్ మీటింగ్ నిర్వహించాలని సూచించారు. అంతకు ముందు ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చించే అజెండా పంపాలంటూ సీఎంవోను ఆదేశించారు సిఈవో.
సీఎంవో కేబినెట్ మీటింగ్ అజెండా పంపడంతో దానిపై సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని స్క్రీనింగ్ కమిటీ మరికాసేపట్లో భేటీ కానుంది. సీఎంవో పంపించిన నాలుగు అంశాలపై నోట్ పంపాలని ఇప్పటికే ఆయా శాఖలను సీఎస్ ఆదేశించారు.
అజెండాలోని అంశాలపై స్క్రీనింగ్ కమిటీ పరిశీలించి అనంతరం సిఈవోకు నివేదిక అందించనుంది. సిఈవో ఆ అజెండాను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించి అనుమతి తీసుకోనున్నారు.
సిఈసీ ఆమోదిస్తే ఈనెల 14న భేటీ కానుంది. ఇకపోతే కేబినెట్ మీటింగ్ లో ఫొని తుపాను సహాయక చర్యలు, తాగునీరు, రాష్ట్రంలోని వాతావరణ పరిస్థితితులు,కరువు, ఉపాధిహామీ వంటి అంశాలను కేబినెట్ అజెండాగా రూపొందించిన విషయం తెలిసిందే.