ఏపీలో చంద్రబాబుకు మరో షాక్: వైసీపీలో చేరిన తిరుపతి టీడీపీ కీలకనేత...

By AN TeluguFirst Published Aug 28, 2021, 1:43 PM IST
Highlights

పద్మావతిపురం నుంచి ర్యాలీగా తరలివచ్చి ఎమ్మెల్యే భూమన నివాసంలో పార్టీ కండువా కప్పుకున్నారు. దొరైరాజ్ కుటుంబానికి వైసీపీలో సముచిత స్థానం కల్పిస్తామని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి హామీ ఇచ్చారు. 


తిరుపతి : టీడీపీ కీలకనేత, నగర ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్న మార్కెట్ దొరైరాజ్ తన అనుచరులతో కలిసి శుక్రవారం వైసీపీలో చేరారు. పద్మావతిపురం నుంచి ర్యాలీగా తరలివచ్చి ఎమ్మెల్యే భూమన నివాసంలో పార్టీ కండువా కప్పుకున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి మరో ఎదురు దెబ్బ తగిలింది. దొరైరాజ్ కుటుంబానికి వైసీపీలో సముచిత స్థానం కల్పిస్తామని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి హామీ ఇచ్చారు. 

1991 నుంచి 2002వరకు దొరైరాజ్ తన అనుచరుడిగానే ఉన్నారని, అనంతరం పలు కారణాల రీత్యా టీడీపీలోకి వెళ్లారన్నారు. ఆయనతో పాటు పరసాల వీధి ఆనంద్, శ్రీధర్ రాయల్, ప్రసాద్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గురుమూర్తి, మేయర్ డాక్టర్ శీరీష, డిప్యూటీ మేయర్లు భూమన అభినయ్ రెడ్డి, ముద్రనారాయణ కార్పొరేటర్ ఎస్ కే బాబు, టౌన్ బ్యాంక్ చైర్మన్ వెంకటేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీకి ఏపీలో ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. కొద్ది మంది ఎమ్మెల్యేలు టీడీపీకి దూరమై వైసీపీ దగ్గరయ్యారు. పలువురు టిడీపీ నేతలు పార్టీకి రాజీనామాలు చేసి వైసీపిలో చేరిపోయారు. తాజాగా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా టీడీపీ రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారు.

గోరంట్ల బుచ్చయ్య చౌదరిని చంద్రబాబు బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. ఆయన బుచ్చయ్య చౌదరికి ఫోన్ చేసి మాట్లాడారు. సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. చంద్రబాబు దూతలుగా కొంత మంది టీడీపీ నేతలు ఆయన వద్దకు వెళ్లి మంతనాలు జరిపారు. 

click me!