
అనంతపురం: అంగన్వాడీ కేంద్రంలో సాధారణంగా చిన్న పిల్లలు కీచులాటలు, వాదులాటలు, అరుపులు, కేకలు వినిపిస్తుంటాయి. ఏడుపులు, పెడబొబ్బలూ వినిపిస్తాయి. ఎందుకంటే అక్కడంతా చిన్న పిల్లలు, అప్పుడప్పుడే ఇతర పిల్లలతో స్నేహం చేసే దశలో ఉండే పిల్లలు కనిపిస్తారు. వారి మధ్య ఎన్నో వాదులాటలు ఉంటాయి. అక్కడ పిల్లలకు పౌష్టికాహారం పెట్టి కొన్ని గంటలపాటు తమ సంరక్షణలో ఉంచుకుంటారు. అంగన్వాడీ కేంద్రం అంటే స్థూలంగా మనకు స్ఫురించే విషయం ఇది. పిల్లల యోగక్షేమాలు చూడటానికి అక్కడ ప్రత్యేకంగా ఆయా ఉంటారు. ఆమె పిల్లలను ఓపికగా ఆడిస్తూ ఉంటారు. కానీ, అనంతపురం అంగన్వాడీ కేంద్రంలో ఆయా ఓ మూడేళ్ల పిల్లాడిపై ప్రతాపం చూపించింది.
అమ్మ కావాలని ఏడుస్తున్న మూడేళ్ల చిన్నారిని ఆ ఆయా బెదిరించింది. అయినా వినకపోయేసరికి వంట గదిలోకి వెళ్లి ఓ కడ్డీతో ఆ చిన్నారి మూతికి వాత పెట్టింది. అప్పికే తల్లి కోసం ఏడుస్తున్న ఆ చిన్నారి ఆయా పెట్టిన వాతతో మరింత ఏడుపు లంకించుకున్నాడు. అనంతరం అక్కడి నుంచి ఇంటికి బయల్దేరాడు. ఇది గమనించిన ఆయా మళ్లీ ఆ పిల్లాడి వెంట పరుగెత్తి.. ఓ చెట్టు కొమ్మతో పిల్లాడిని కొట్టింది. ఆ చెట్టు కొమ్మతో కొట్టుకుంటూ పిల్లాడిని మళ్లీ అంగన్వాడీ కేంద్రానికి తీసుకువచ్చింది. ఈ ఘటన అనంతపురం జిల్లా
శ్రీనివాస్ నగర్లో చోటుచేసుకుంది.
లక్ష్మీ, సంగారెడ్డి దంపతుల కుమారుడు ఈశ్వర్ కృష్ణను ఎప్పట్లాగే గురువారం అంగన్వాడీ కేంద్రానికి పంపి వచ్చారు. కానీ, కొద్ది సేపటికే ఆ చిన్నారి తల్లి కోసం ఏడుపు మొదలుపెట్టాడు. ఆ అంగన్వాడీ కేంద్రంలో పనిచేస్తున్న సహాయకురాలు వెంటనే వంట గదిలోకి చిన్నారిని తీసుకెళ్లి కడ్డీతో మూతికి వాత పెట్టింది. ఆ బాధతో పసివాడు విలవిల్లాడిపోయాడు. వెంటనే ఆ అంగన్వాడీ కేంద్రానికి సమీపంలోనే ఉన్న తమ ఇంటికి పరుగెత్తాడు. కానీ, ఆయా ఓ చెట్టు కొమ్మతో ఆ బాలుడిని కొట్టుకుంటూ వెనక్కి తెచ్చింది.
శుక్రవారం ఉదయం కుమారుడి మూతి మీద వాతను తల్లిదండ్రులు గమనించారు. బాలుడి తండ్రి విషయం తెలుసుకుని అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి సదరు ఆయాపై ప్రశ్నలు సంధించారు. ఆమె సరైన సమాధానం చెప్పలేదు. సరికదా ఎదురు తిరిగింది. చిన్నారి మూతిపై వాత మాత్రమే కాదు, ఆ బాలుడి వీపు, తొడల పైనా గాయాలు కనిపించాయి.
ఈ ఘటనపై అనంత ఐసీడీఎస్ సీడీపీఓ లలిత స్పందించారు. ఏం జరిగిందో విచారిస్తామని తెలిపారు. చిన్నారిని కొట్టారనే ఘటనకు సంబంధించి తమకు ఎవరి నుంచీ ఫిర్యాదు అందలేదని వివరించారు. జరిగిన ఘటన గురించి వివరాలు తెలుసుకోవడానికి ఆ అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి విచారిస్తానని చెప్పారు. ఒక వేళ అదే ఘటన నిజమని తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.