అక్రమ సంబంధం తెచ్చిన తంటా.. ముగ్గురు ఆత్మహత్యాయత్నం..!

By telugu news teamFirst Published Oct 7, 2021, 3:26 PM IST
Highlights

సుబ్బారావుకు సూర్యకొండలరావు భార్య సంధ్యాకుమారికి అక్రమ సంబంధం ఉన్న విషయం ఆ రెండు కుటుంబాల్లో తెలిసి గొడవలు మొదలయ్యాయి.

అక్రమ సంబంధం రెండు కుటుంబంలో పెద్ద చిచ్చు రేపింది. చివరకు ముగ్గురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడాల్సి వచ్చింది. కాగా.. వారిలో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఉప్పలగుప్తం మండలం ఎస్‌.యానానికి చెందిన పలచోళ్ల సూర్య కొండలరావు, సంధ్యాకుమారి భార్యభర్తలు. సూర్య కొండలరావు ఎస్‌.యానంలోని చమురు సంస్థలో పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. వీరి కుటుంబం అమలాపురం రవణం మల్లయ్యవీధిలో కాపురం ఉంటోంది. ఇదే ప్రాంతంలో చెందిన గండు సుబ్బారావు, నాగలక్ష్మి దంపతులు నివసిస్తున్నారు. సుబ్బారావుకు సూర్యకొండలరావు భార్య సంధ్యాకుమారికి అక్రమ సంబంధం ఉన్న విషయం ఆ రెండు కుటుంబాల్లో తెలిసి గొడవలు మొదలయ్యాయి. తర్వాత భార్యభర్తలు సూర్యకొండలరావు, సంధ్యా కుమారి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో అక్రమ సంబంధం తెచ్చిన చిచ్చుతో మనస్తాపం చెందిన సుబ్బారావు భార్య నాగలక్ష్మి నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది.

తర్వాత సూర్య కొండలరావు, సంధ్యాకుమారి దంపతులు సోమవారం సాయంత్రం అల్లవరం మండలం బోడసకుర్రు వంతెన వద్ద పొలంలో గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తక్షణమే స్థానికులు స్పందించి ఆ భార్యాభర్తలను అమలాపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి అత్యవసర వైద్యం అందించే ఏర్పాట్లు చేశారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో కాకినాడలోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రికి తరలించారు.

అప్పటి నుంచి చికిత్స పొందుతూ భర్త సూర్య కొండలరావు బుధవారం ఉదయం మృతి చెందినట్టు సీఐ బాజీలాల్‌ తెలిపారు. అతడి భార్య సంధ్యాకుమారి పరిస్థితి విషమంగానే ఉంది. నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసుకున్న నాగలక్ష్మి కూడా అమలాపురంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. సూర్యకొండలరావు ఆత్మహత్యకు, అతడి భార్య ఆత్యహత్యాయత్నానికి కారణమైన సుబ్బారావు, నాగలక్ష్మి దంపతులతోపాటు రవణం సాయమ్మ అనే మహిళపైనా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. 

click me!