
విశాఖపట్నం: స్నేహితులంతా కలిసి ఓ పెళ్లివేడుకలో పాల్గొని ఆనందంగా గడిపారు. తిరిగి తమ స్వస్థలానికి వెళుతుండగా యువకులు ప్రయాణిస్తున్నా కారు ఘోర రోడ్డుప్రమాదానికి గురయ్యింది. దీంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఇలా పెళ్లి కబుర్లతో ఆనందంగా సాగుతున్న వారి ప్రయాణం ఒక్కసారిగా విషాదాంతమయ్యింది.
వివరాల్లోకి వెళితే... అనకాపల్లి జిల్లా మాకరపాలెం మండలం తామరం గ్రామానికి చెందిన ఐదుగురు యువకులు పెళ్ళి వేడుక కోసం గురువారం తూర్పుగోదావరి జిల్లా తునికి వెళ్ళారు. వివాహంలో పాల్గొని సరదాగా గడిపిన వీరు రాత్రి తమ స్వస్థలానికి కారులో తిరుగుపయనమయ్యారు. పెళ్లిలో జరిగిన సంఘటనలు, స్నేహితుల మధ్య చోటుచేసుకున్న సరదా ఘటనలు గుర్తుచేసుకుంటూ ఆనందంగా సాగుతున్న ప్రయాణం ఒక్కసారిగా కుదుపుకు గురయ్యింది.
Video
తెల్లవారుజామున సుమారు ఐదుగంటల సమయంలో యువకులు ప్రయాణిస్తున్న కారు నర్సీపట్నం వద్ద ప్రమాదానికి గురయ్యింది. సుబ్బరాయుడి పాలెం గ్రామ సమీపానికి రాగానే ఒక్కసారిగా అదుపుతప్పిన కారు రోడ్డుపైనుండి కిందకు దూసుకెళ్లింది. ఇలా అతివేగంతో వెళ్ళి ఓ చెట్టును ఢీకొని కారు ఆగింది.
ఈ ఘోర ప్రమాదంలో కారులోని ముగ్గురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు యువకులు తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రమాదస్థలంలో భయానక పరిస్థితి నెలకొంది. చెట్టను ఢీకొన్న కారు తుక్కుతుక్కవగా మృతదేహాలు చెల్లాచెదురుగా పడివున్నాయి. అలాగే గాయాలపాలైన వారు రక్తమోడుతూ పడివున్నారు.
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని ముందుగా గాయపడిన యువకులను సమీపంలోని నర్సీపట్నం హాస్పిటల్ కు తరలించారు. అనంతరం మిగతా ముగ్గురు యువకులు మృతదేహాలను కూడా పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
కారు ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అతివేగంతో పాటు తెల్లవారుజామున డ్రైవర్ నిద్రమత్తులో డ్రైవింగ్ చేయడమే ఈ ప్రమాదానికి కారణమై వుంటుందని అనుమానిస్తున్నారు. గాయాలపాలైన ఇద్దరు యువకుల పరిస్థితి కూడా విషమంగా వున్నట్లు సమాచారం.