జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన డిమాండుకు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సై అన్నారు. తాను రాజీనామా చేసి తిరిగి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వల్లభనేని వంశీ ప్రకటించారు.
విజయవాడ: మూడు రాజధానుల వివాదంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజీనామాల రాజకీయం నడుస్తోంది. తాను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ చెప్పారు. వల్లభనేని వంశీ గన్నవరం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే.
మూడు రాజధానులకు వ్యతిరేకంగా, లేదంటే అమరావతిని రాజధానిగా జగన్ ప్రభుత్వం కాదనడానికి వ్యతిరేకంగా కృష్ణా, గుంటూరు జిల్లాల టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.
Also Read: పాత కక్షలతోనే రాజధాని మార్పు.. కృష్ణా, గుంటూరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి: పవన్
తెలుగుదేశం పార్టీ (టీడీపీ)కి చెందిన 23 మంది శాసనసభ్యుల చేత రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలను ఆహ్వానించాలని వైసీపీ నేతలు కూడా చంద్రబాబును డిమాండ్ చేస్తున్నారు. మంత్రి కొడాలి నాని, వైసీపీ ఎమ్మెల్యే రోజా అదే డిమాండ్ చేశారు. ప్రాంతానికి ఒక్కరి చొప్పున రాజీనామా చేసి తిరిగి పోటీ చేసి గెలవాలని ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి సవాల్ చేశారు.
ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు తిరిగి గెలిస్తే అమరావతికి కట్టుబడి ఉంటామని, లేదంటే జగన్ నిర్ణయాన్ని అంగీకరించాలని రోజా చంద్రబాబును డిమాండ్ చేశారు. మూడు రాజధానుల బిల్లులకు గవర్నర్ బిశ్వభూషణ్ ఆమోద ముద్ర వేసిన నేపథ్యంలో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్రమైన వాగ్వివాదాలు జరుగుతున్నాయి.
Also Read: గాజువాకలో చిత్తుగా ఓడించారు, అందుకే విశాఖపై కసి: పవన్ మీద రోజా