గొల్లపూ'ఢీ': రంగంలోకి వల్లభనేని వంశీ, ఉద్రిక్తత

By narsimha lodeFirst Published Jan 19, 2021, 10:37 AM IST
Highlights

మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు గొల్లపూడి ఎన్టీఆర్ సెంటర్‌లో దీక్ష చేస్తానని చేసిన ప్రకటన కృష్ణా జిల్లా రాజకీయాల్లో కలకలం రేపింది. గొల్లపూడి సెంటర్ లో ఉద్రిక్తత చోటు చేసుకొంది. 
 

విజయవాడ: మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు గొల్లపూడి ఎన్టీఆర్ సెంటర్‌లో దీక్ష చేస్తానని చేసిన ప్రకటన కృష్ణా జిల్లా రాజకీయాల్లో కలకలం రేపింది. గొల్లపూడి సెంటర్ లో ఉద్రిక్తత చోటు చేసుకొంది. 

ముందుగా ప్రకటించిన విధంగానే మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు గొల్లపూడి సెంటర్ లో ఎన్టీఆర్ విగ్రహాం వద్ద దీక్షకు మంగళవారం నాడు ప్రయత్నించడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. దేవినేని ఉమా మహేశ్వరరావును అరెస్ట్ చేసిన కొద్దిసేపటికే  ఈ ప్రాంతానికి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అక్కడికి చేరుకొన్నారు. అదే సమయంలో అక్కడే ఉన్న టీడీపీ కార్యకర్తలు వైసీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సమయంలో ఇరువర్గాలను పోలీసులు అడ్డుకొన్నారు. దీంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది.

also read:విజయవాడ గొల్లపూడి సెంటర్‌లో ఉద్రిక్తత: మాజీ మంత్రి దేవినేని ఉమ అరెస్ట్

గత ప్రభుత్వ హాయంలో చోటు చేసుకొన్న అభివృద్ది కార్యక్రమాలతో పాటు తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై చర్చించేందుకు తాము సిద్దంగా ఉన్నామని వైసీపీ ఎమ్మెల్యే ప్రకటించారుచర్చకు ఏ మీడియా ఛానెల్‌ స్టూడియోలోనైనా తాము సిద్దమేనని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తెలిపారు. అభివృద్ది కార్యక్రమానికి అడ్డు పడకూడదని వైసీపీ కార్యకర్తలు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

మరోవైపు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, బాపట్ల ఎంపీ నందిగం సురేష్ లు ర్యాలీగా  ఈ ప్రాంతానికి చేరుకొన్నారు. ఈ సమయంలో పోలీసులు వారిని అడ్డుకొన్నారు. 

మంత్రి కొడాలినానికి మాజీ మంత్రి దేవినేని ఉమా మధ్య ఏమైనా ఉంటే వారే తేల్చుకోవాలని  కృష్ణప్రసాద్ చెప్పారు. కానీ మధ్యలో సీఎం జగన్ పై విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని ఆయన చెప్పారు.

click me!