ఇలాగేనా అభిప్రాయాలు సేకరించేది?

First Published May 28, 2017, 2:45 PM IST
Highlights

అభిప్రాయసేకరణ పేరుతో రైతుల చుట్టూ బ్యారేకేడ్లు కట్టడమేంటని ప్రశ్నించారు. అంటే స్ధానికుల నుండి అధికారులకు ఇబ్బందులు వస్తాయని ప్రభుత్వం ఊహించే పెద్ద ఎత్తున పోలీసులను దింపినట్లు అర్ధమవుతోంది.

రాజధాని ప్రాంతంలో భూసేకరణపై జరిగిన అభిప్రాయసేకరణలో ఆదివారం గందరగోళం రేగింది. సిఆర్డిఏ పరిధిలోని ఉండవల్లిలో భూసేకరణపై రైతుల్లో అభిప్రాయసేకరణ చేయాలని ప్రభుత్వం అనుకున్నది. వెంటనే గ్రామానికి ప్రభుత్వ అధికారులు చేరుకున్నారు.

రైతులందరినీ ఒకచోట చేర్చి వారి అభిప్రాయ సేకరణ చేద్దామనుకున్న ప్రభుత్వం భారీ సంఖ్యలో పోలీసులను కూడా వెంటపంపించింది. దాంతో రైతులకు మండింది. అభిప్రాయసేకణ అంటూ మధ్యలో పోలీసులను దింపాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ అధికారులను గ్రామస్తులు నిలదీసారు.

విషయం తెలుసుకున్న మంగళగిరి ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి అక్కడికి చేరుకున్నారు. అప్పటికే రైతులు, గ్రామస్తుల్లో పలువురు తమ భూములను ఇచ్చేది లేదంటూ చెబుతున్నారు. అధికారుల దగ్గరకు వచ్చి మాట్లాడాలని ప్రయత్నించిన వారిని పోలీసులు నియంత్రిస్తున్నారు. దాంతో ఎంఎల్ఏకి మండింది.

అభిప్రాయసేకరణ పేరుతో రైతుల చుట్టూ బ్యారేకేడ్లు కట్టడమేంటని ప్రశ్నించారు. అంటే స్ధానికుల నుండి అధికారులకు ఇబ్బందులు వస్తాయని ప్రభుత్వం ఊహించే పెద్ద ఎత్తున పోలీసులను దింపినట్లు అర్ధమవుతోంది. పోలీసులను దించింతే గ్రామస్తులు భయపడిపోయి దారికి వస్తారని ఊహిచిందేమో ప్రభుత్వం.

అదే విషయమై ఎంఎల్ఏ మాట్లాడుతూ, బ్యారికేడ్లు కట్టి ప్రజాభిప్రాయం అడగటమేంటంటూ మండిపడ్డారు. ప్రభుత్వం కుయుక్తులను న్యాయపోరాటం ద్వారా అడ్డుకుంటామని హెచ్చరించారు. అదే సమయంలో రైతులు, గ్రామస్తులు కూడా అధికారులను కడిగిపారేసారు. దాంతో అధికారులకు ఏం  చేయాలో దిక్కుతోచటం లేదు.

click me!