ఆంధ్రప్రదేశ్లో ధరలు భారీగా పెరగడంతో తెలంగాణ నుంచి మద్యం అక్రమ రవాణా పెరిగిపోతోంది.
గుంటూరు: ఆంధ్రప్రదేశ్లో ధరలు భారీగా పెరగడంతో తెలంగాణ నుంచి మద్యం అక్రమ రవాణా పెరిగిపోతోంది. సరిహద్దు జిల్లాల నుంచి లక్షల రూపాయల మద్యం తెలంగాణ నుండి ఏపీకి నిత్యం అక్రమంగా తరలుతోంది. తాజాగా గుంటూరు జిల్లాలో రెంటచింతల మండలంలోని సత్రశాల వద్ద సుమారు 1.6 లక్షల విలువైన అక్రమ మద్యం పట్టుబడింది.
ఓ ట్రాక్టర్ లో తెలంగాణ నుంచి 1200 వందల బాటిళ్లను అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం మేరకు ఎక్సైజ్ పోలీసులు మెరుపుదాడి చేసి పట్టుకున్నారు. దీంతో మద్యం బాటిళ్ళతో పాటు వాటిని తరలిస్తున్నవారు పట్టుబడ్డారు.
read more పోలీస్ స్టేషన్లో ఏడేళ్ల చిన్నారి నిర్బంధం...ఇది వైసిపి చట్టమేనా?: చంద్రబాబు సీరియస్
ఈ సందర్భంగా డిఎస్పీ శ్రీహరిబాబు మాట్లాడుతూ... అక్రమంగా మద్యం రవాణా చేసి జీవితాలు నాశనం చేసుకోవద్దని సూచించారు. మద్యం రవాణా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డబ్బులకు ఆశపడి అక్రమ మద్యం రవాణా బాటను ఎంచుకుంటున్నారని... ఎక్సైజ్ తదితర కేసులలో పట్టుబడితే రౌడీషీట్లు తెరిచే అవకాశముందని హెచ్చరించారు.
''నిరుద్యోగులు అక్రమార్కుల వలలో చిక్కుకోవద్దని, వారి ఉజ్వల భవిషత్తును నాశనం చేసుకోవద్దని కోరుతున్నాం. అలానే అక్రమ రవాణా విషయం తెలిసిన వారు తమకు సమాచారం ఇస్తే, వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం'' అని డీఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో రూరల్ సిఐ ఉమేష్, తదితరులు పాల్గొన్నారు.