టీ హైకోర్టు నుంచి సుప్రీంకు రఘురామ వైద్య పరీక్షల నివేదిక: కుమారుడికి నో ఎంట్రీ

By telugu teamFirst Published May 19, 2021, 7:01 AM IST
Highlights

వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణమ రాజుకు నిర్వహించిన వైద్య పరీక్షల నివేదికను తెలంగాణ హైకోర్టు సుప్రీంకోర్టుకు పంపించింది. సీల్డ్ కవర్ ఆ నివేదికను మంగళవారం సాయంత్రం పంపించింది.

హైదరాబాద్: వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణమ రాజుకు నిర్వహించిన వైద్య పరీక్షల నివేదిక తెలంగాణ హైకోర్టు సీల్డ్ కవర్ లో సుప్రీంకోర్టుకు పంపించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సికింద్రాబాదు ఆర్మీ ఆస్పత్రిలో రఘురామకృష్ణమ రాజుకు వైద్య పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ముగ్గురు వైద్యుల బృందం ఆర్మీ ఆస్పత్రిలో రఘురామకు వైద్య పరీక్షలు నిర్వహించింది. వైద్య బృందం మెడికల్ రిపోర్టును సీల్డ్ కవర్ లో తెలంగాణ హైకోర్టు సుప్రీంకోర్టు పంపించింది. 

రఘురామ కృష్ణమ రాజుకు నిర్వహించే వైద్య పరీక్షల పర్యవేక్షణకు తెలంగాణ హైకోర్టు నాగార్జునను జ్యుడిషియల్ అధికారిగా నియమించింది. ఆర్మీ ఆస్పత్రి నిర్వహించి వైద్య పరీక్షల నివేదికను నాగార్జున హైకోర్టుకు అందించారు. డాక్టర్ల నివేదికతో పాటు వీడియో ఫుటేజీని సీల్డ్ కవర్ లో సుప్రీంకోర్టుకు మంగళవారం సాయంత్రం పంపించింది. 

Also Read: మెడికల్ కేర్ లో రఘురామ: ప్రకటన విడుదల చేసిన ఆర్మీ ఆస్పత్రి

రఘురామ కృష్ణమ రాజు కుమారుడు భరత్ దాఖలు చేిసన పిటిష్ మీద విచారణ జరిపిన సుప్రీంకోర్టు సికింద్రాబాదు ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలకు ఆదేశించింది.  దాంతో మంగళవారం ఉదయం రఘురామ రాజుకు రక్త, చర్మ, ఇతర పరీక్షలు నిర్వహించారు. చర్మ వ్యాధి నిపుణుడిని బయటి నుంచి రప్పించి పరీక్ష చేయించినట్లు తెలుస్తోంది. 

రఘురామ కృష్ణమ రాజుకు నిర్వహించిన వైద్య పరీక్షల నివేదికను సుప్రీంకోర్టు శుక్రవారం పరిశీలిస్తుంది. వైద్య పరీక్షల నిర్వహణ నుంచి నివేదికను సుప్రీంకోర్టుకు పంపడం వరకు అంతా రహస్యంగానే జరిగింది. సుప్రీంకోర్టు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు రఘురామ కృష్ణమ రాజు సికింద్రాబాదు ఆర్మీ ఆస్పత్రిలోనే ఉంటారు. 

Also Read: రఘురామకు ముగ్గురు వైద్యుల పరీక్షలు: జ్యుడిషియల్ అధికారిగా నాగార్జున

ఇదిలావుంటే, తన తండ్రిని కలిసేందుకు రఘురామ కృష్ణమ రాజు కుమారుడు భరత్ ప్రయత్నించాడు. మంగళవారం మధ్యాహ్నం ఆయన ఆస్పత్రికి వచ్చారు. అయితే, ఆర్మీ అధిరాకులు ఆయనను లోనికి అనుమతించలేదు. మీడియా ప్రతినిధులను ఆస్పత్రికి 500 మీటర్ల దూరంలోనే ఆపేశారు.  

సిఐడి కస్టడీలో ముసుగులు ధరించిన ముగ్గురు వ్యక్తులు తనను కర్రలతో, ఫైబర్ తాళ్లతో తన పాదాలపై కొట్టారని రఘురామ కృష్ణమ రాజు కోర్టుకు ఫిర్యాదు చేశారు. గుంటూరు జిజీహెచ్ లోనూ రమేష్ ఆస్పత్రిలోనూ రఘురామకు వైద్య పరీక్షలు నిర్వహించి నివేదిక సమర్పించాలని కోర్టు ఆదేశించింది. అయితే, గుంటూరు జీజీహెచ్ లో ఆయనకు వైద్య పరీక్షలు జరిగాయి. గుంటూరు వైద్య బృందం కోర్టుకు నివేదిక అందజేసింది. 

రఘురామకృష్ణమ రాజుకు అయిన గాయాలు కొట్టడం వల్ల అయినవి కావని, ఎడెమా వల్ల అరిపాదాలు కమిలినట్లు అయ్యాయని వైద్యుల బృందం తేల్చింది. రమేష్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించకపోవడంతో రఘురామ కృష్ణమ రాజు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రమేష్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించడానికి సిఐడి తరపు న్యాయవాది దుష్యంత్ దవే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 

రఘురామ కృష్ణమ రాజు తరఫున ముకుల్ రోహత్గీ వాదించారు. ఇరువురి వాదనలు విన్న సుప్రీంకోర్టు రఘురామకృష్ణమ రాజుకు సికింద్రాబాదులోని ఆర్సీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. దీంతో ఆయనను సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రికి తరలించారు.

click me!