ఐసీసీ వన్డే ప్రపంచకప్ టోర్నీలో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన మహిళా క్రకెటర్ మిథాలీరాజ్ కు తెలంగాణ ప్రభుత్వం కోటి రూపాయల నగదు బహుమతిని ప్రకటించింది. అలాగే బంజారాహిల్స్లో 600 గజాల స్థలాన్ని కేటాయిస్తామని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.
ప్రగతిభవన్లో సీఎంను కలవడానికి వచ్చిన మహిళా క్రికెటర్ మిథాలీరాజ్ కు ఆత్మీయ స్వాగతం లభించింది. ఐసీసి వన్డే ప్రపంచకప్ లో మహిళా టీం ప్రదర్శనను సీఎం కొనియాడారు. క్రీడాకారులను ఆండగా నిలబడి, వారి ప్రతిభను వెలికితీయడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. మిథాలీతో పాటుగా టీం కోచ్ మూర్తికి రూ.25 లక్షల బహుమానాన్ని ప్రకటించారు.
వరల్డ్కప్ మ్యాచ్లను తాను చూశానని, బాగా ఆడారంటూ మిథాలీరాజ్ను కేసీఆర్ అభినందించారు. మహిళా క్రికెటర్లు తమ అద్భుత ఆటతీరుతో దేశ గౌరవాన్ని కాపాడారని అన్నారు. భవిష్యత్తులో ఇంకా మెరుగైన ప్రదర్శన చేసి తెలుగువారి ఖ్యాతిని చాటిచెప్పాలని సీఎం పిలుపునిచ్చారు.