మంగళగిరి పోలీస్ స్టేషన్లో జోగి రమేష్... టిడిపి శ్రేణులు భారీగా పోగవడంతో ఉద్రిక్తత, గేటుకు తాళం

By Arun Kumar PFirst Published Sep 17, 2021, 3:59 PM IST
Highlights

కొద్దిసేపటి క్రితం చంద్రబాబు నాయుడు ఇంటివద్ద నెలకొన్న ఉద్రిక్త పరిస్థితే ప్రస్తుతం తాడేపల్లి పోలీస్ స్టేషన్ వద్ద నెలకొంది. పోలీస్ స్గేషన్ వద్దకు టిడిపి శ్రేణులు భారీగా చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.   

తాడేపల్లి: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఇంటివద్ద టిడిపి,వైసిపి శ్రేణులు బాహాబాహీకి దిగిన విషయం తెలిసిందే. అయితే తాజాగా అక్కడ ఉద్రిక్తత తగ్గి మంగళగిరి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చంద్రబాబు ఇంటి ముట్టడికి యత్నించిన వైసిపి ఎమ్మెల్యే జోగి రమేష్ తో పాటు వైసిపి నాయకులు, కార్యకర్తలను పోలీసులు మంగళగిరి పోలీస్ స్టేషన్ కు తరలించారు.  

అయితే ప్రస్తుతం తాడేపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో పోలీస్ స్టేషన్ గేట్ కు తాళం వేసి వారిని లోపలికి రాకుండా అడ్డుకుంటున్నారు పోలీసులు. ఈ క్రమంలోనే పోలీసులకు, టిడిపి శ్రేణులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నా వినకుండా స్టేషన్ వద్దే టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేస్తూ అక్కడే ఆందోళనకు దిగారు.  

ఇక ప్రస్తుతం మంగళగిరి పోలీస్ స్టేషన్ లో వున్న ఎమ్మెల్యే జోగి రమేష్ టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని మరోసారి డిమాండ్ చేశారు. లేదంటే ప్రజాక్షేత్రంలోకి చంద్రబాబు ఇక ఎప్పటికీ రాలేడని హెచ్చరించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై చేసిన వాఖ్యలపై అయ్యన్నపాత్రుడు కూడా క్షమాపణ చెప్పాలన్నారు. 

కొద్దిసేపటి క్రితమే శాంతియుతంగా నిరసన చేపట్టాలని వెళ్లిన తమపై దాడిచేయించింది చంద్రబాబేనని జోగి రమేష్ ఆరోపించారు. కాబట్టి ఈ దాడికి సూత్రదారి అయినపై ఆయనపై కూడా పోలీసులు కేసు పెట్టాల్సిందేనని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.  

read more  నీ సరదాను మేమెందుకు కాదంటాం? వడ్డీతో సహా వడ్డిస్తాం: జగన్ కు లోకేష్ వార్నింగ్

అంతకుముందు వైసిపి ప్రభుత్వం, సీఎం జగన్ పై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా చంద్రబాబు నివాసాన్ని ముట్టడించేందుకు వైసిపి ఎమ్మెల్యే జోగి రమేష్ ప్రయత్నించారు. ఈ విషయం తెలిసి చంద్రబాబు ఇంటివద్దకు టిడిపి శ్రేణులు కూడా భారీగా చేరుకున్నారు. ఈ క్రమంలోనే టిడిపి, వైసిపి శ్రేణుల మధ్య ఘర్షణ చెలరేగింది. 

ఎమ్మెల్యే జోగి రమేష్ పై టిడిపి కార్యకర్తలు దాడి చేశారు. టీడీపీ, వైసిపి నాయకులు పరస్పరం తోపులాటకు దిగి రాళ్లతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ రాళ్ల దాడిలో పలువురు నాయకులకు తీవ్ర గాయాలయ్యాయి. రాళ్ళదాడిలో ఎమ్మెల్యే రమేష్ కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఇలా రాళ్లు రువ్వుకుంటున్న ఇరుపార్టీల కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జి చేశారు. 

 

click me!