26న భారత్ బంద్... టీడీపీ సంపూర్ణ మద్ధతు: అచ్చెన్నాయుడు

Arun Kumar P   | Asianet News
Published : Mar 23, 2021, 09:31 AM ISTUpdated : Mar 23, 2021, 09:36 AM IST
26న భారత్ బంద్... టీడీపీ సంపూర్ణ మద్ధతు: అచ్చెన్నాయుడు

సారాంశం

 విశాఖ ఉక్కు పోరాట వేధిక, రైతు సంఘాలు ఈనెల 26న తలపెట్టిన భారత్ బంద్ కు టీడీపీ సంపూర్ణ మద్ధతు తెలుపుతోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. 

అమరావతి: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, నూతన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ విశాఖ ఉక్కు పోరాట వేధిక, రైతు సంఘాలు ఈనెల 26న తలపెట్టిన భారత్ బంద్ కు టీడీపీ సంపూర్ణ మద్ధతు తెలుపుతోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. కాబట్టి టీడీపీ కార్యకర్తలు, నాయకులు ఈ బంద్ లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

''కర్షక, కార్మిక, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంలో టీడీపీ ఏనాడూ వెనుకంజ వేయదు. రాష్ట్రంలో మోటార్లకు మీటర్లను బిగించే నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలి. వైసీపీ ప్రభుత్వం అప్పుల కోసం రైతులను బలి చేస్తోంది. మీటర్ల బిగింపును వ్యతిరేకిస్తూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతాం'' అని అచ్చెన్నవెల్లడించారు. 

''నూతన సాగు చట్టాలపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలి. రైతుల బాధలను పాలకులు అర్థం చేసుకోవాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలోనూ రాష్ట్ర ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటున్నారు. కేంద్రంపై పోరాడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కేసుల భయంతో కేంద్రానికి వత్తాసు పలుకుతోంది. పార్లమెంట్ దగ్గరకు వెళ్లిన కార్మికులను వైసీపీ ఎంపీలు అవమానించారు. కార్మికుల చేతనే వారి బాధలు కేంద్ర పెద్దలకు వినిపిస్తామని ప్రగల్భాలు పలికి పార్లమెంటు దగ్గరకు వచ్చిన కార్మికులతో తమకు సంబంధం లేదని మాట్లాడటం సిగ్గుచేటు'' అని అచ్చెన్న మండిపడ్డారు. 

''స్టీల్ ప్లాంట్ భూములను అమ్మి ఆ డబ్బును ఏం చేస్తారని వైసీపీ నేతలు అడగడం చూస్తే కార్మికుల జీవితాలను తలచుకుంటే బాధేస్తోంది. 28 మంది ఎంపీలు ఉండి రాష్ట్రానికి ఏం లాభం.? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డకోలేకపోయిన దద్ధమ్మ ప్రభుత్వం వైసీపీ. పార్లమెంటులో టీడీపీ ఎంపీలు చేస్తున్న పారాటాన్ని చూసైనా వైసీపీలో కదలిక రావాలి. పార్లమెంటులో టీడీపీ ఎంపీల పోరాటాన్ని దేశం మొత్తం  చూస్తోంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు కేంద్రం పార్లమెంటు సాక్షిగా అడుగులు వేస్తుంటే వైసీపీ ఎంపీలు ఎందుకు మౌనం వహిస్తున్నారు.?'' అని ప్రశ్నించారు. 

''చీకటి ఎజెండాతో కార్మికులను రోడ్డున పడేస్తున్నారు. నయవంచనకు, నమ్మక ద్రోహానికి మారుపేరుగా వైసీపీ నిలిచింది. దేశానికి గర్వకారణమైన విశాఖ ఉక్కును కాపాడాల్సిన బాధ్యత జగన్ రెడ్డిపై లేదా? జగన్ సహకారంతోనే పోస్కోతో ఒప్పందం జరిగింది. తెలుగు ప్రజల గుండె చప్పుడైన విశాఖ ఉక్కును కాపాడేందుకు ఎలాంటి త్యాగాలకైనా టీడీపీ సిద్ధం. స్టీల్ ప్లాంట్, కార్మికుల జీవితాలపై వైసీపీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే రాజీనామాలు చేసి పోరాటానికి రావాలి'' అని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. 

 

PREV
click me!

Recommended Stories

Ramzan Holidays : మారిన రంజాన్ సెలవులు.. ఒకటి కాదు రెండ్రోజులు హాలిడేసే
ఇన్నిరోజులకి ఇద్దరిని చూశా ఇవి తినని వాళ్ళని: AP State Food Commission Shock | Asianet News Telugu