టీడీపీ సీనియర్ నేత, సినీ నటి కవిత బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ ఏపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు సమక్షంలో ఆదివారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆమె కమలం కండువా కప్పుకున్నారు.
తర్వాత మీడియాతో మాట్లాడుతూ, బాధతోనే టీడీపీకి రాజీనామా చేశానని, టీడీపీ నుంచి తనను అవమాననించి గెంటేశారని కవిత అన్నారు. 1983 నుంచి టీడీపీకి సేవలు అందించానని చెప్పారు. ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన అనేక పథకాలు నచ్చడంతోనే బీజేపీలో చేరానని తెలిపారు. టీడీపీ నుంచి తాను బయటకు రాలేదని, తనను గెంటేశారని ఆవేదనగా పేర్కొన్నారు. టీడీపీ బలోపేతం కోసం అహర్నిశలు పనిచేశానని, పార్టీ కోసం కష్టపడ్డందుకు అనేక అవమానాలు ఎదుర్కొన్నానని తెలిపారు.
పనిచేసిన వారికి సముచితన్యాయం చేస్తానని చంద్రబాబు పదే పదే చెబితే నిజంగానే న్యాయం చేస్తారని అనుకున్నా కానీ అన్యాయం చేస్తారని అనుకోలేదన్నారు. చంద్రబాబు మోసకారి అని చాలా మంది చెబుతున్నా నమ్మలేదని, ఇప్పుడే అర్థమైందని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్పై నమ్మకంతోనే టీడీపీలో చేరానని, చంద్రబాబు ఎన్టీఆర్ హామీని తుంగలో తొక్కారని మడిపడ్డారు. చంద్రబాబు ప్రతి పోరాటంలో తాను పాల్గొన్నానని, అయినా తనను అవమానించి, బాధపెట్టి గెంటేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.