ఏపీలో రాజకీయ వేడి రాజుకుంటోంది. సాధారణ ఎన్నికలకు మరికొద్ది నెలలు మాత్రమే ఉండటంతో అభ్యర్థులు తమ భవితవ్యంపై ప్రణాళికలు రచించుకుంటున్నారు. తమతోపాటు తమ కుటుంబ సభ్యుల రాజకీయ భవిష్యత్ పై ఆలోచించి నెమ్మదిగా అడుగులు వేస్తున్నారు.
ప్రకాశం: ఏపీలో రాజకీయ వేడి రాజుకుంటోంది. సాధారణ ఎన్నికలకు మరికొద్ది నెలలు మాత్రమే ఉండటంతో అభ్యర్థులు తమ భవితవ్యంపై ప్రణాళికలు రచించుకుంటున్నారు. తమతోపాటు తమ కుటుంబ సభ్యుల రాజకీయ భవిష్యత్ పై ఆలోచించి నెమ్మదిగా అడుగులు వేస్తున్నారు.
ఏపార్టీలో ఉంటే తాము గెలుస్తామో ఆ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అవుతున్నారు. అటు పార్టీలో అసంతృప్తులు సైతం గోడలు దూకేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు జంప్ అయితే మరికొందరు గోపీల్లా అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ప్రకాశం జిల్లాలో పట్టు సాధించేందుకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చాలా చాకచక్యంగా పావులు కదుపుతున్నారు. గ్రూపు రాజకీయాలతో సతమతమవుతున్న టీడీపీ ఎమ్మెల్సీ కరణం బలరాం ను పార్టీలో తీసుకువచ్చేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారట. అద్దంకి సీటును కరణం కరణం బలరాం తనయుడు వెంటకేష్ కు కేటాయిస్తానని హామీ కూడా ఇస్తున్నారట.
వాస్తవానికి 2014 ఎన్నికల్లో అద్దంకి నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా గొట్టిపాటి రవికుమార్, టీడీపీ అభ్యర్థిగా కరణం బలరాం పోటీ పడ్డారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ గెలిచారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన టీడీపీలోకి జంప్ అయ్యారు.
అప్పటికే రాజకీయ ఆధిపత్యపోరు ఉన్న గొట్టిపాటి, కరణం బలరాంలు ఒకే పార్టీలో బుసలుకొట్టుకోవడం మెుదలెట్టారు. ఒకే వరలో రెండు కత్తులు ఇమడవన్నట్లు టీడీపీలో గొట్టిపాటి రవికుమార్, కరణం బలరాంలు ఇమడలేకపోతున్నారు. ఒకానొక సందర్భంలో ఒకరిపై ఒకరు దాడి సైతం చేసుకున్నారు. దారి కాచి దాడులు కూడా చేసుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన చంద్రబాబు నాయుడు ఇద్దరిని కూర్చోబెట్టి సర్ధిచెప్పారు.
సయోధ్యలో సీఎం చంద్రబాబు నాయుడు, లోకేష్ లు గొట్టిపాటి రవికుమార్ కు సానుకూలంగా మాట్లాడారని కరణం బలరాం సన్నిహితుల వద్ద వాపోయారట. గొట్టిపాటి చేరికతో కరణం ఫ్యామిలీకి పసుపు పార్టీలో ప్రాధాన్యత తగ్గిందని పార్టీ కార్యకర్తలు అభిమానులు వాపోతున్నారు.
రాబోయే ఎన్నికల్లో అద్దంకి టిక్కెట్ తన కుమారడు వెంకటేష్ కు ఇవ్వాలని కరణం బలరాం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కోరారట. అయితే టిక్కెట్ ఇవ్వడం కుదరదని చంద్రబాబు తేల్చిచెప్పేశారు. దీంతో కరణం బలరాం వైసీపీతో టచ్ లో ఉన్నారని తెలుస్తోంది.
ఇప్పటికే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో చర్చించినట్లు కూడా సమాచారం. జగన్ వద్ద కూడా తన కుమారుడు కే టిక్కెట్ ఇవ్వాలన్న ప్రతిపాదన పెట్టారట. అయితే ముందు పార్టీలో చేరండి ఆ తర్వాత చూద్దాం అని జగన్ అన్నట్లు తెలుస్తుంది.
ఇప్పటికే అద్దంకి నియోజకవర్గానికి బాచిన చెంచు గరటయ్య ఇంచార్జ్ గా ఉండటంతో జగన్ ఎలాంటి హామీ ఇవ్వలేదని పార్టీలోకి రావాలని మాత్రం ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అయితే కరణం బలరాం రాక మరింత ఆలస్యం అవుతుండటంతో జగన్ పునరాలోచనలో పడినట్లు సమాచారం.
కరణం బలరాం గత ఎన్నికల్లో ఓడినా, అంతకు ముందు ఓడినా జిల్లాను ప్రభావితం చెయ్యగల నాయకుల్లో ఒకరని అలాంటి వ్యక్తిని వదులుకునేందుకు జగన్ సిద్ధంగా లేరని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కరణం బలరాం కుమారుడికి టిక్కెట్ ఇస్తానని ముందు పార్టీలోకి వచ్చి పార్టీ బలోపేతానికి కృషి చెయ్యండని చెప్పినట్లు సమాచారం.
అయితే టీడీపీ ఎమ్మెల్సీ కరణం బలరాం పార్టీ మారే అవకాశం లేదని తెలుస్తోంది. ఒకవేళ మారాల్సి వస్తే ఎన్నికల ముందు వస్తారని సమాచారం. ఇప్పటికే కరణం బలరాంపై ఫ్యాక్షన్ కేసులు ఉన్నాయి. ఈనేపథ్యంలో బలరాం పార్టీ జంప్ అయితే వాటిని ఎదుర్కోవాల్సి వస్తుందని, ఇప్పుడు వెళ్తే లేనిపోని తలనొప్పి అదే ఎన్నికల సమయానికి వెళ్తే ఎలాంటి లొల్లి ఉండదని భావిస్తున్నట్లు సమాచారం.