వాయిదా తీర్మానంపై పట్టు: ఏపీ అసెంబ్లీ నుండి టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్

By narsimha lodeFirst Published Sep 19, 2022, 2:26 PM IST
Highlights


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ నుండి టీడీపీ ఎమ్మెల్యేలను సోమవారం నాడు స్పీకర్  సస్పెండ్ చేశారు. వ్యవసాయంపై తాము ఇచ్చిన వాయిదా తీర్మానంపై టీడీపీ సభ్యులు చర్చకు పట్టుబట్టారు. దీంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సభా కార్యక్రమాలకు అంతరాయం కల్గిస్తున్నారని  ఏపీ అసెంబ్లీ నుండి టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుండి టీడీపీ ఎమ్మెల్యేలను ఒక్క రోజు పాటు సస్పెండ్ చేశారు. వరుసగా మూడు రోజుల పాటు ఏదో అంశంపై టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళన చేస్తున్నారు. సభా కార్యక్రమాలకు అంతరాయం కల్గిస్తున్నారని సస్పెన్షన్ కు గురౌతున్నారు. పదే పదే అసెంబ్లీ కార్యక్రమాలకు అంతరాయం కల్గిస్తున్నందున టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్టుగా స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు.

సోమవారం నాడు అసెంబ్లీలో తమ వాయిదా తీర్మానంపై చర్చకు టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. వ్యవసాయం, రైతాంగ సమస్యలపై  టీడీపీ సభ్యులు వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు.అయితే ఈ తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరిస్తున్నట్టుగా స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. అయితే తమ వాయిదా తీర్మానంపై చర్చకు టీడీపీ  ఎమ్మెల్యేలు పట్టుబట్టారు.

ఈ నెల 15వ తేదీన ఏపీ  అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అదే రోజున ఏపీ అసెంబ్లీలో పాలనా వికేంద్రీకరణపై చర్చ సమయంలో రాజధాని భూముల అంశంపై చర్చ  సందర్భంగా పయ్యావుల కేశవ్ కు మాట్లాడే అవకాశం కల్పించాలని టీడీపీ సభ్యులు సభలో నిరసనకు దిగారు.ఈ సమయంలో సభా కార్యక్రమాలకు అంతరాయం కల్గిస్తున్నారని టీడీపీ సభ్యులను సభ నుండి సస్పెండ్ చేశారు.ఈ నెల 16వ తేదీన ధరల పెరుగుదల అంశంపై టీడీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది.

also read:ఏపీ అసెంబ్లీ సమావేశాలు: 14 మంది టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్

ఈ వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. దీనిపై టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. వెల్ లోకి వచ్చి ఆందోళన చేశారు. సభలో గందరగోళ వాతావరణం ఏర్పడడంతో టీడీపీ సభ్యులను సభ నుండి సస్పెండ్ చేశారు.  ఈ నెల 17, 18 తేదీల్లో అసెంబ్లీకి సెలవు. ఇవాళ అసెంబ్లీ తిరిగి ప్రారంభమైంది. ఇవాళ కూడా వ్యవసాయంపై ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చకు టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. ఈ సమయంలో సభలోనే ఉన్న సీఎం వైఎస్ జగన్ టీడీపీ సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సభా కార్యక్రమాలకు అంతరాయం కల్గించడంపై మండిపడ్డారు. సస్పెండ్ చేయాలని కోరారు. సభా కార్యక్రమాలకు అంతరాయం కల్గిస్తున్నందున ఒక్క రోజు పాటు టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నట్టుగా స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. 

 


 

click me!