కేంద్ర వైఖరికి వ్యతిరేకంగా నిరసన
భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటన ఏపీలో పొలిటికల్ హీట్ పెంచింది. శుక్రవారం ఉదయం స్వామివారిని దర్శించుకుని తిరుగు ప్రయాణమవుతున్న అమిత్ షా కాన్వాయ్ పై దాడి చేశారనే ఆరోపణలతో ముగ్గురు తెదేపా కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ తిరుపతి నగర శాసనసభ్యురాలు సుగుణమ్మ నిన్న రాత్రి నుంచి ఉదయం వరకు అలిపిరి పోలీస్స్టేషన్ వరకు ధర్నాకు దిగారు.
కేంద్రం, రాష్ట్రంలోని ప్రతిపక్షం కుమ్మక్కై తెదేపాపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాయంటూ ఆరోపించారు. నగర తెదేపా శ్రేణులు మొత్తం అలిపిరి పోలీస్స్టేషన్ ఎదుట బైఠాయించటంతో కొన్ని గంటల పాటు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో అప్రమత్తమైన పోలీసులు తెదేపా కార్యకర్తలను విడుదల చేశారు. విభజన చట్టంలోని హామీలు నెరవేర్చాలని శాంతి యుతంగా నిరసన తెలుపుతున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై భాజపా శ్రేణులు ఉద్దేశపూర్వకంగానే కవ్వింపు చర్యలకు పాల్పడ్డారని ఎమ్మెల్యే సుగుణమ్మ, తుడా ఛైర్మన్ నరసింహయాదవ్ మండిపడ్డారు.