
అమరావతి: పోలీస్ శాఖలో పనిచేస్తున్న హోంగార్డుల జీతాలను వెంటనే పెంచాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి సమీర్ శర్మ (sameer sharma)ను టిడిపి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ (anagani satyaprasad) కోరారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు కల్పించే అన్ని సౌకర్యాలను హోంగార్డులకు కూడా కల్పించాలంటూ సీఎస్ కు లేఖ రాసారు ఎమ్మెల్యే అనగాని.
రాష్ట్ర ప్రభుత్వం హోంగార్డుల జీతభత్యాల పెంపు విషయమై చర్యలు తీసుకోకపోవడంతో హోంగార్డులు తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అనగాని పేర్కొన్నారు. హోంగార్డుల వేతనాల పెంపుదల విషయమై గతంలో సుప్రీంకోర్టు ధిక్కార పిటిషన్ ఇచ్చిందని... ఈ ఆదేశాలను అమలు చేయాలని డిజిపి ఆదేశించి చేతులు దులుపుకున్నారని పేర్కొన్నారు. హోంగార్డులకు ఉద్యోగులకు సమానంగా వేతనాలు ఇవ్వాలని అశుతోష్ మిశ్రా కమిటీ (ashutosh mishra committee) కూడా సూచించిందని అనగాని పేర్కొన్నారు.
వేతనాల పెంపుదలపై తక్షణమే నిర్ణయం తీసుకుని 16 వేల మంది హోంగార్డుల కుటుంబాలకు న్యాయం చేయాలని అనగాని సీఎస్ ను కోరారు.అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగాహోంగార్డులకు కూడా పదవీ విరమణ వయసును 60 సంవత్సరాల నుండి 62 సంవత్సరాలకు పెంచాలన్నారు. రిటైర్మెంట్ అనంతరం ఇచ్చే గ్రాట్యుటీ రూ.పది లక్షలు చేయాలని సీఎస్ ను కోరారు.
పోలీస్ శాఖలో హోం గార్డులు అత్యంత కీలకమని... మండుటెండలో నిలబడి ట్రాఫిక్ క్రమబద్దీకరణ నుండి వీఐపీల భద్రత వరకు వారి సేవలు అమోఘమని అన్నారు. కరోనా సమయంలో హోం గార్డులు ప్రజలకు అందించిన సేవలు మరచిపోలేనివని అనగాని గుర్తుచేసారు.
హోంగార్డుల ఇబ్బందుల్ని గుర్తించిన టిడిపి (TDP) ప్రభుత్వం 2018 లో జీవో నెం.77 తో రోజువారీ వేతనాలను రూ.600 పెంచామన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన హోంగార్డులకు రూ.5 లక్షలు మాత్రమే ఉన్న బీమాను గత ప్రభుత్వం రూ.30లక్షలకు పెంచిందన్నారు. తర్వాత వచ్చిన వైసిపి ప్రభుత్వం రోజువారి వేతనాన్ని కేవలం రూ.110 పెంచుతూ 2019లో జీవో.876 జారీ చేసి చేతులు దులుపుకుందని ఎమ్మెల్యే అనగాని మండిపడ్డారు.