కొన్ని నియోజకవర్గాలకు కొత్త ఇంచార్జీలను అధికార వైసిపి నియమించడం ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో దుమారం రేగింది. ఓటమి భయంతోనే ఈ చర్యలకు పాల్పడినట్లు టిడిపి నాయకులు అంటున్నారు.
అమరావతి : ఎన్నికలు దగ్గరపడుతున్నవేళ ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీలు ఇప్పటినుండే పక్కా వ్యూహాలతో ముందుకు వెళుతున్నాయి. ఈ క్రమంలోనే అధికార వైసిపి ఏకంగా కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలనే పక్కన పెట్టేందుకు సిద్దమయ్యింది. ఎమ్మెల్యేలు, నాయకుల్లో అసంతృప్తిని రగిలిస్తుందని తెలిసినా వైసిపి అధిష్టానం పలు నియోజకవర్గాలకు కొత్త ఇంచార్జీల నియమించింది. ఇలా మంగళగిరిలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వుండగా మరొకరిని పార్టీ ఇంచార్జీగా నియమించారు. ఈ క్రమంలో పార్టీ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తంచేస్తూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసారు ఆర్కె. దీంతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాలు హీటెక్కాయి.
కొత్త ఇంచార్జీల నియామకాలతో వైసిపి లో మొదలైన అలజడిని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తప్పదని వైసిపి పెద్దలకు అర్థమయ్యిందని... ఆ భయంతోనే అభ్యర్థుల మారుస్తున్నారని అన్నారు. కానీ ఏం చేసినా వైసిపి గెలుపు అసాధ్యమని టిడిపి నాయకులు అంటున్నారు. ఇలా కొందరు టిడిపి నాయకులు వైసిపి ఇంచార్జీల మార్పుపై స్పందించారు.
ఏపీ టిడిపి అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు వైసిపి నూతన ఇంచార్జీల నియామకంపై రియాక్ట్ అయ్యారు. ''వైసీపీ అసెంబ్లీ అభ్యర్థులను కాదు కదా... స్వయంగా ఆ పార్టీ అధ్యక్షుడిని మార్చినా గెలుపు అసాధ్యం! వైసిపికి అధికారం ఇంకా మూడు నెలలే...!'' అంటూ అచ్చెన్నాయుడు ట్వీట్ చేసారు.
మరో టిడిపి సీనియర్ నేత ధూళిపాళ్ళ నరేంద్ర కూడా వైసిపి ఇంచార్జీల నియామకంపై స్పందించారు. ''మీ ప్రభుత్వాన్ని మార్చాలని ప్రజలు డిసైడ్ అయిన తరువాత.....మీరు ఎంత మందిని మార్చినా ఫలితం సున్నా. ప్రజా వ్యతిరేకత ఉందని అభ్యర్థులను మార్చుకుంటూ పోతే...పులివెందులతో సహా మొత్తం 151 మార్చాల్సిందే!'' అని ధూళిపాళ్ల అన్నారు.