ఆంధ్రప్రదేశ్లో ఓట్ల తొలగింపు, దొంగ ఓట్ల చేర్పులపై కేంద్ర ఎన్నికల సంఘానికి తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేసింది. ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు అధ్యక్షతన పార్టీ నేతల బృందం మంగళవారం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసింది. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ ఒత్తిళ్లతో తప్పుడు ఓటర్ల జాబితా తయారు చేసినట్లు ఈసీకి ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఉపాధ్యాయుల సేవలను వినియోగించుకుంటారని, కానీ ఏపీలో మాత్రం జగన్ వాలంటీర్లు, గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారని దుయ్యబట్టారు. వారి కనుసన్నల్లోనే ఎన్నికల ప్రక్రియ జరుగుతోందని అచ్చెన్నాయుడు ఆరోపించారు.
ఎన్నికల సంఘానికి ఈ విషయంపై వివరించామని , అక్టోబర్ 27 వరకు దేశమంతా ఓటు వెరిఫికేషన్ ప్రక్రియ జరిగిందని అచ్చెన్నాయుడు వివరించారు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఆ విధానం పూర్తిగా జరగలేదని.. దీనికి ఆధారాలతో సహా ఈసీకి వివరించామని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఏపీలో దాదాపు 10 లక్షల మంది ఫాం 6, ఫాం 7, ఫాం 8ని అప్లయ్ చేశారని.. వీటిపై ఈసీ దృష్టి సారించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: ఓటర్ల జాబితాలో అవకతవకలు .. దొంగల పార్టీ అధికారంలోకి వస్తే అరాచకమే : టీడీపీపై సజ్జల వ్యాఖ్యలు
గతంలో ఏపీలో ఒక కుటుంబానికి చెందిన వ్యక్తులు ఒకే పోలింగ్ బూత్ పరిధిలోకి వచ్చేవారని , ఇప్పుడు పరిస్ధితి మారిందని , ఇంట్లోని నలుగురిని నాలుగు పోలింగ్ బూత్లలోకి మారుస్తున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. చనిపోయినవారి వివరాలను, ఒకే వ్యక్తికి రెండు ఓట్లు ఉన్నట్లు ఆధారాలతో సహా చూపించామని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. దాదాపు 160 పోలింగ్ స్టేషన్లు ఈసీ నిబంధనలకు విరుద్ధంగా వున్నాయని చెప్పారు. గ్రామ సచివాలయ ఉద్యోగులను బీఎల్వోలుగా నియమించారని.. దొంగ ఓట్లు తొలగించాలని ఈసీని కోరామని , దీనిపై వారు సానుకూలంగా స్పందించారని అచ్చెన్నాయుడు వెల్లడించారు.