
నంద్యాల కానిస్టేబుల్ సురేంద్ర హత్య (nandyal constable murder case) తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం బాధిత కుటుంబ సభ్యులను టీడీపీ నేతలు పరామర్శించారు. మాజీ మంత్రులు ఎన్ఎండీ ఫరూక్, భూమా అఖిలప్రియ, నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డిలు సురేంద్ర కుటుంబాన్ని పరామర్శించి.. ఓదార్చారు.
ఇకపోతే.. నంద్యాల పట్టణంలోని డిఎస్పీ కార్యాలయంలో కానిస్టేబుల్ గూడూరు సురేంద్ర కుమార్ (35) క్లర్క్ గా పని చేస్తున్నాడు. అతను ఆదివారం రాత్రి విధులు ముగించుకుని డిఎస్పి కార్యాలయం నుంచి మోటార్సైకిల్ పై ఇంటికి వెళుతున్నాడు. థియేటర్ సమీపంలో ఆరుగురు వ్యక్తులు ఆయనను అటకాయించారు.
Also Read:నంద్యాలలో కానిస్టేబుల్ దారుణ హత్య, కిడ్నాప్ చేసి, కత్తితో వీపు, గుండెల్లో పొడిచి...
అక్కడే ఉన్న ఓ ఆటోలో బలవంతంగా ఎక్కించారు. ఆటో డ్రైవర్ పై కత్తి పెట్టి నంద్యాల శివారులోని చెరువు కట్టపైకి తీసుకువెళ్లారు. అక్కడ కానిస్టేబుల్ సురేంద్ర కుమార్ ను కత్తితో గుండెలపై, వీపులో పొడిచారు. ఆ తరువాత అదే ఆటోలో పట్టణంలోకి తిరిగి వస్తూ.. అతడిని ఆసుపత్రికి తీసుకు వెళ్లాలని డ్రైవర్ కు చెప్పారు. ఆ తరువాత మధ్యలో దిగి పరారయ్యారు. ఆటో డ్రైవర్ సురేంద్ర కుమార్ ను ఆసుపత్రికి తీసుకురాగా.. వైద్యులు పరీక్షించి అప్పటికే అతను మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆసుపత్రికి చేరుకున్న కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
సమాచారం అందుకున్న ఎస్పి రఘువీర్ రెడ్డి, డీఎస్సీ మహేశ్వర్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రౌడీషీటర్లే ఈ దారుణానికి ఒడిగట్టారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.