దళితులపై దాడులు: సీబీఐ విచారణ టీడీపీ నేత వర్లరామయ్య డిమాండ్, డీజీపీకి లేఖ

By Siva KodatiFirst Published Aug 29, 2020, 3:56 PM IST
Highlights

రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు టీడీపీ నేత వర్ల రామయ్య. సినీ నిర్మాత నూతన్ నాయుడి ఇంట్లో దళిత యువకుడికి శిరోముండనం చేయడంపై ఆయన దిగ్భ్రాంతి  వ్యక్తం చేశారు

రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు టీడీపీ నేత వర్ల రామయ్య. సినీ నిర్మాత నూతన్ నాయుడి ఇంట్లో దళిత యువకుడికి శిరోముండనం చేయడంపై ఆయన దిగ్భ్రాంతి  వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో దళితులపై దాడులు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ వర్ల రామయ్య  డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు లేఖ రాశారు. వైసీపీ పాలనలో దళితులపై దాడులు నిత్యకృత్యమయ్యాయని ఆయన ఎద్దేవా చేశారు.

అరాచక శక్తులు పేట్రేగిపోతున్నాయని.. వైసీపీ రాజకీయంగా ప్రేరేపించబడిన దాడులను కప్పిపుచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాని రామయ్య ఆరోపించారు. రాష్ట్రంలో దళితుల ఆత్మగౌరవం దెబ్బ తీసేలా దాడులు జరుగుతున్నాయని, ఓం ప్రతాప్, విశాఖ శ్రీకాంత్ శిరోముండనం, చిత్తూరులో మానుబోతుల నారాయణ హత్యపై విచారణ జరిపించాలని వర్ల డిమాండ్ చేశారు.

Also Read:నూతన్ నాయుడి ఇంట్లో శిరోముండనం: బాధితుడి వేదన ఇదీ... (వీడియో)

ఏపీలో దళితుల హక్కులను పరిరక్షించడంలో రాజ్యాంగ వ్యవస్థలు పూర్తిగా విఫలమయ్యాయని.. దళితులపై అసాధారణంగా దాడులు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

కఠినమైన చర్యలతోనే దాడులు ఆగుతాయని, దళితులపై జరుగుతున్న దాడులపై సీబీఐ దర్యాప్తు జరిపి నిందితులను శిక్షించాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు. ముందుగా ఓం ప్రతాప్ మరణంపై సమోటాగా కేసు ఎందుకు ఫైల్ చేయలేదని ఆయన ప్రశ్నించారు.

చనిపోయిన ఓం ప్రతాప్ ఫోన్ ఎక్కడుందన్న ఆయన.. పోలీసులు ఆ ఫోన్‌లోని కాల్ లిస్ట్‌ను ఎందుకు పరిశోధించడం లేదని నిలదీశారు. అందుకే ఓం ప్రతాప్ కేసును సీబీఐకి అప్పగించాలని తాను డిమాండ్ చేస్తున్నట్లు వర్ల రామయ్య లేఖలో పేర్కొన్నారు. 

click me!