
నెల్లూరు: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై తెలుగుదేశం పార్టీ నేత, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. స్థిరత్వం లేని పవన్ కల్యాణ్ రాజకీయాలకు పనికిరారని ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో అన్నారు.
పవన్ కల్యాణ్ తొలి నుంచీ స్థిరత్వం లేకుండా వ్యవహరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఒక రోజు ఒక మాట, మర్నాడు మరో మాట మాట్లాడుతూ ప్రజల్లో చులకన అయ్యారని అభిప్రాయపడ్డారు.
పంచాయతీరాజ్ శాఖామంత్రి లోకేష్ అవినీతి పరుడంటూ, సీఎం కుర్చీపై ఆరాట పడుతున్నారంటూ పవన్ మాట్లాడడం సిగ్గు చేటు అని ఆయన అన్నారు. అతి చిన్న వయసులో మంత్రి అయిన లోకేష్ పని తీరుతో దేశంలోనే తొలిసారి కేంద్రం నుంచి పంచాయతీరాజ్ తరపున తొమ్మిది అవార్డులను పొందారని గుర్తు చేశారు.
గ్రామాల్లో ప్రతి వీధికి ఎల్ఈడీ లైట్లు, సిమెంటు రోడ్లు, ఇంటింటికి కుళాయిలు వేయించిన ఘనత మంత్రి లోకేష్ దేనని ఆయన అన్నారు. మొన్నటి వరకు టీడీపీ ప్రభుత్వాన్ని ప్రశంసించిన పవన్ కల్యాణ్ ఇప్పుడు విమర్శలు చేయడం ఏమిటని ప్రశ్నించారు.