తిరుపతిలో ఆ ఏడుగురు జాతిరత్నాల ప్రచారం...: అనురాధ సెటైర్లు

Arun Kumar P   | Asianet News
Published : Apr 07, 2021, 12:39 PM IST
తిరుపతిలో ఆ ఏడుగురు జాతిరత్నాల ప్రచారం...: అనురాధ సెటైర్లు

సారాంశం

తిరుపతి పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏడుగురు దందారాయుళ్లు వైసిపి తరపున ప్రచారం నిర్వహిస్తున్నారని టిడిపి నాయకురాలు పంచుమర్తి అనురాధ ఆరోపించారు. 

తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో  వైసీపీ జాతి రత్నాలు పాల్గొంటున్నారని టీడీపీ ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ సెటైర్లు విసిరారు. ఏడు నియోజకవర్గాల్లో ఏడుగురు దందారాయుళ్లు వైసిపి తరపున ప్రచారం నిర్వహిస్తున్నారని అనురాధ ఆరోపించారు. 

''బాలినేని మంత్రయ్యాక ఒక్క ఎర్రచందనం దొంగనైనా పట్టుకున్నారా? కొడుకును అడ్డం పెట్టుకుని మైనింగ్ లో సంపాదిస్తున్న మీరు ఓట్లు అడిగేందుకు వెంకటగిరి వెళ్లారా? స్కూళ్లలో కరోనాపై ఒక్కసారైన విద్యాశాఖ మంత్రి సమీక్ష చేశారా? మధ్యాహ్న భోజనం పథకంలో గుడ్లు సరఫరా గురించి ప్రతిపక్షంగా మేము ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక గుడ్లు తేలేసిన మంత్రి ఓట్లు అడిగేందుకు వెళతాడా?'' అని మండిపడ్డారు. 

read more  ఇంటెలిజెన్స్ నివేదిక... తిరుపతిలో ప్రచారానికి సిద్దమైన జగన్

''కొడాలి నాని సత్యవేడులో పేకాట క్లబ్ తెరిచేందుకు వెళ్లారా? మంత్రి మేకపాటి ఒక్క కొత్త పరిశ్రమనైనా ఏపీకి తీసుకొచ్చారా? చంద్రబాబు తీసుకొచ్చిన పరిశ్రమలను తరిమికొట్టడం మినహా మీరు చేసిందేంటి? ఖరీఫ్-రబీకి తేడా తెలీని మంత్రి కన్నబాబు శ్రీకాళహస్తిలో ఏం ప్రచారం చేస్తారు?'' అని ఎద్దేవా చేశారు. 

''71శాతం పోలవరం పూర్తిచేసిన ఘనత టీడీపీదే. క్రికెట్ బెట్టింగ్ లు నిర్వహించే మంత్రి అనిల్ గూడూరును ఉద్దరించడానికి వచ్చారా? పింక్ డైమండ్ వ్యవహారంపై హైకోర్టు మొట్టికాయలు వేసినా వైసీపీ ప్రభుత్వానికి సిగ్గు రాలేదు. పేర్ని నాని ఏ మోహం పెట్టుకుని తిరుపతి ప్రజలను ఓటు అడుగుతున్నారు? ఇక మంత్రి పెద్దిరెడ్డి ఆగడాలకు అంతే లేదు'' అంటూ విమర్శించారు. 

''వైసీపీ మంత్రుల బెదిరింపులకు తిరుపతి ప్రజలు భయపడొద్దు. నిజం బతకాలంటే ఓటర్లు తెలుగుదేశానికి పట్టం కట్టాలి. ప్రలోభాలకు లొంగకుండా టీడీపీకి ఓటేయండి. ప్రజాస్వామ్యాన్ని బతికించండి'' అని అనురాధ తిరుపతి ఓటర్లకు సూచించారు. 
 

PREV
click me!

Recommended Stories

Cyclone Alert : బంగాళాఖాతంలో తుపాను..? ఇక భారీ వర్షాలతో అల్లకల్లోలమేనా..?
YS Jagan & Vijay at Chennai Wedding: చెన్నైలోని వివాహవేడుకలో ఒకే వేదికపై జగన్, విజయ్| Asianet Telugu