జగన్ బటన్లు నొక్కేది నిధులు బుక్కేందుకే...: నక్కా ఆనంద్ బాబు

By Arun Kumar PFirst Published May 22, 2023, 2:53 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 

బాపట్ల : ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించడానికి కాదు రాష్ట్రాన్ని దోచుకోడానికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుతున్నాడని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ఆరోపించారు. జగన్ కేవలం బటన్ నొక్కడమే కాదు ఆ నిధులను బుక్కుతాడని అన్నారు. చివరకు ఇసుకను కూడా సీఎం వదిలిపెట్టడం లేదని అన్నారు. రాష్ట్రాన్ని జగన్ దోచుకుంటే నియోజకవర్గాలను వైసిపి ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారని ఆనంద్ బాబు ఆరోపించారు. 

బాపట్ల జిల్లా వేమూరులో జరిగిన "ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి " కార్యక్రమ ముగింపు బహిరంగ సభకు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు నక్కా ఆనంద్ బాబు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు ఎప్పుడొచ్చినా టిడిపిని గెలిపించడానికి ప్రజలు సిద్దంగా వున్నారన్నారు. జగన్ పాలనలో రాష్ట్రంలోని ఏ ఒక్క వర్గం కూడా ఆనందంగా లేదని... నమ్మి ఓట్లేసిన ప్రజలందరినీ ఆయన నమ్మకద్రోహం చేశాడన్నారు. రానున్న ఎన్నికల్లో వైసిపిని చిత్తు చిత్తుగా ఓడించాలని మాజీ మంత్రి ప్రజలకు సూచించారు. 

ఇంటి, వృత్తి పన్ను పెంచి ప్రజలపై భారం మోపడమే కాదు చివరకు చెత్త మీద కూడా పన్ను వేసాడు ఈ  చెత్త సిఎం జగన్ రెడ్డి అంటూ మండిపడ్డారు. మరుగుదొడ్ల మీద కూడా పన్ను వేసిన ఏకైక సీఎం జగన్ అంటూ ఎద్దేవా చేసారు. జగన్ ప్రజలకు ఇచ్చింది నవరత్నాలు కాదు నవ మోసాలు అని ఆనంద్ బాబు అన్నారు. 

Read More  బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేయను.. వాళ్లు మంచి పని చేస్తున్నారనే మాట్లాడాను: కేశినేని కీలక వ్యాఖ్యలు

గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధం చేస్తానన్న జగన్ ఇప్పుడు దానికి కట్టుబడి ఉన్నాడా? అని మాజీ మంత్రి ప్రశ్నించారు.రాష్ట్రంలో అక్రమ మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన డబ్బులన్నీ తాడేపల్లి ప్యాలెస్ కు పోతున్నాయని అన్నారు. పేదల రక్తం తాగే జలగ జగన్ రెడ్డి అంటూ ఆనంద్ బాబు మండిపడ్డారు. 

ఏ రాష్ట్రానికయినా ఒక్కటే రాజధాని ఉంటుంది... మూడు రాజధానులు ఎక్కడైనా ఉన్నాయా? అని నిలదీసారు. ముఖ్యమంత్రి జగన్ రాజధానుల పేరిట ప్రాంతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూశాడని... కానీ అది సాధ్యం కాలేదన్నారు. అందుకే ఇప్పుడు పేదలు, ధనికులు అంటున్నాడని మాజీ మంత్రి మండిపడ్డారు. 

వైసిపి ప్రభుత్వం ఇప్పటికే రూ.9 లక్షల కోట్ల అప్పుచేసి రాష్ట్రాన్ని దివాళా తీయించిందన్నారు. ఈ అప్పులన్నీ ఎవరు కట్టాలి? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతే... ఈ దుర్మార్గ పాలన పోవాలంటే తెలుగుదేశం రావాలన్నారు. జాబు రావాలి అంటే బాబు రావాలి అని యువత కోరుకుంటున్నారని అన్నారు. టిడిపి అధికారంలోకి వస్తే సంక్షేమం ఆపడం కాదు...మరింత మెరుగైన సంక్షేమం ఇస్తామని మాజీ మంత్రి ఆనంద్ బాబు పేర్కొన్నారు. 

click me!