కర్నూల్ జిల్లాలో భగ్గుమన్న ఫ్యాక్షన్ కక్షలు: టీడీపీ నేత సుబ్బారావు హత్య

By narsimha lodeFirst Published Dec 17, 2019, 1:34 PM IST
Highlights

కర్నూల్ జిల్లాలో  బనగానపల్లెలో ఫ్యాక్షన్ కక్షలు భగ్గుమన్నాయి. టీడీపీ నేత మంజుల సుబ్బారావు మంగళవారం నాడు దారుణ హత్యకు గురయ్యాడు. 


కర్నూల్: కర్నూల్ జిల్లా కొలిమిగుండ్ల మండలం చింతలాయపల్లెలో టీడీపీ నేత మంజుల సుబ్బారావును ప్రత్యర్థులు మంగళవారం నాడు వేట కొడవళ్ళతో తల నరికి చంపారు. మంజుల సుబ్బారావు మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్ రెడ్డి ప్రధాన అనుచరుడు.

కర్నూల్ జిల్లాలోని కొలిమిగుండ్ల మండలంలోని చింతలాయపాలెం వద్ద టీ స్టాల్‌ వద్ద టీ తాగుతున్న సమయంలో ప్రత్యర్థులు రాళ్లతో అతనిపై దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత వేట కొడవళ్లతో నిందితులు తల నరికి చంపారు.

రెండు వాహనాల్లో వచ్చిన నిందితులు సుబ్బారావును  హత్య  చేసిన తర్వాత  అక్కడి నుండి పారిపోయారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న సమయంలో  ప్రత్యర్థులు ఉద్దేశ్యపూర్వకంగానే  తమ పార్టీ కీలక నేతను హత్య చేశారని  టీడీపీ నేతలు చెబుతున్నారు. సుబ్బారావును హత్య  చేసింది వైసీపీ నేతలేనని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్ రెడ్డి ఆరోపించారు.

ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో జరిగిన ఎన్నికల్లో బీసీ జనార్ధన్ రెడ్డి గెలుపు కోసం సుబ్బారావు తీవ్రంగా కృషి చేశారు. గ్రామంలో ఆయనకు కొందరితో తగాదాలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. అయితే సుబ్బారావు హత్యకు కారణాలు ఏమిటనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.

సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని ఆధారాలను సేకరిస్తున్నారు. మరో వైపు టీడీపీ నేతలు కూడ సంఘటన స్థలానికి భారీగా చేరుకొన్నారు. ఈ మండలం ఫ్యాక్షన్ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. దీంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు అదనపు బలగాలను మోహరించారు.

click me!