జాతీయ విద్యా విధానంతో...ఏపీలో 34వేల స్కూల్స్, 15వేల టీచర్లకు ఎసరు: జవహర్ ఆందోళన

Arun Kumar P   | Asianet News
Published : Jun 18, 2021, 03:03 PM IST
జాతీయ విద్యా విధానంతో...ఏపీలో 34వేల స్కూల్స్, 15వేల టీచర్లకు ఎసరు: జవహర్ ఆందోళన

సారాంశం

జాతీయ విద్యా విధానం 2020 ద్వారా విద్యార్థులే కాదు ఉపాద్యాయులు కూడా నష్టపోయే ప్రమాదముందని మాజీ మంత్రి జవహర్ ఆరోపించారు. 

గుంటూరు: నూతన విద్యా విధానాన్ని రాష్ట్రంలో అమలు చేసేందుకు వైసిపి ప్రభుత్వం సిద్దమయిన విషయం తెలిసిందే. అయితే ఈ విద్యా విధానం ద్వారా విద్యార్థులే కాదు ఉపాద్యాయులు కూడా నష్టపోయే ప్రమాదముందని మాజీ మంత్రి జవహర్ ఆరోపించారు. ఈ మేరకు నూతన విద్యావిదానం వల్ల నష్టాలను వివరిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి జవహర్ ఓ బహిరంగ లేఖ రాశారు. 

సీఎంకు జగన్ రాసిన లేఖ యధావిధిగా... 
 
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు,
ముఖ్యమంత్రి.

విషయం - విద్యా వ్యవస్థ నిర్వీర్యం - పాఠశాలలు మూతబడే ప్రమాదం - ఉపాధ్యాయ జీవితాలు సైతం ప్రశ్నార్ధకం - ప్రాథమిక పాఠశాల వ్యవస్థను ఫౌండేషన్ కోర్సుగా మార్పు - వెనకబడిన వర్గాలు, బడుగు బలహీన వర్గాలకు విద్యను దూరం చేస్తున్న ప్రభుత్వం
    
మీ నిర్లక్ష్యపూరిత విధానాలతో విద్యా వ్యవస్థ నిర్వీర్యం గురించి ఈ లేఖ ద్వారా మీ దృష్టికి తీసుకువస్తున్నాను.  గడిచిన రెండేళ్లుగా రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బలోపేతానికి ఒక్క చర్యనైనా తీసుకోలేదు. అందుకే నాణ్యమైన విద్యలో నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2018-19లో దేశంలోనే రాష్ట్రం 3వ స్థానంలో ఉంటే మీ హయాంలో 2019-20లో 18వ స్థానం, 2020-21లో 19వ స్థానానికి దిగజార్చారు.  
    
ప్రభుత్వం అవలంభిస్తున్న చర్యలలో పాఠశాలల స్థాయిని తగ్గించడం, ఉపాధ్యాయ పోస్టుల కుదింపు ప్రధాన గంఢంగా కనిపిస్తున్నా నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటున్నారు. జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం 1 నుండి 12వ తరగతి వరకు ఉన్న 12 (5+5+2) సంవత్సరాల పాఠశాల విద్యకు మూడు సంవత్సరాల పూర్వ ప్రాథమిక విద్యను కలిపి 15 (5+3+3+4) సంవత్సరాల పాఠశాల విద్యగా మార్చబడింది. ఈ చర్యల్లో భాగంగా పాఠశాలల పునర్వ్యవస్థీకరణతో ప్రాధమిక విద్యా గందరగోళానికి గురయ్యే ప్రమాదం కనిపిస్తుంది. అమలుకు సాధ్యంకాని ప్రణాళిక రూపొందించి విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారు.
    
మన రాష్ట్రంలో 1 నుండి 5 వరకు ప్రాధమిక పాఠశాలలు, 6 నుంచి 10 వరకు ఉన్నత పాఠశాలలు, 11, 12 తరగతులను ఇంటర్ విద్యగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పుడు 3,4,5 తరగతులను ప్రాధమికోన్నత లేదా ఉన్నత పాఠశాలలో కలపాలని చేయడం దారుణం. ఇదే జరిగితే ప్రాథమిక పాఠశాలలు ఫౌండేషన్ పాఠశాలలుగా మారిపోతాయి. మూడు ప్రాథమిక పాఠశాలలను కలిపి ఒక ఫౌండేషన్ పాఠశాలలుగా కుదిస్తే రెండు ఉపాధ్యాయ పోస్టులు మిగిలిపోతాయి. అంటే 34వేల ప్రాథమిక పాఠశాలలు మూతబడతాయి, తద్వారా దాదాపు 15వేల పోస్టులకు ఎసరపడుతుంది. 

ఇప్పటికే ఉపాధ్యాయులను అనేక విషయాల్లో మోసం చేశారు. కరోనాలోను 600 మంది ఉపాధ్యాయులు చనిపోతే ప్రభుత్వం పట్టించుకోలేదు.  పౌండేషన్ పాఠశాలల్లో రెండ తరగతి వరకే విద్య అందుబాటులో ఉంటుంది. అంటే 3,4,5 తరగతుల విద్యార్ధులు తమ నివాసానికి ఒక కి.మీ. ఉండే ప్రాథమిక పాఠశాలలను విడిచిపెట్టి మూడు కి.మీ. ఉండే ప్రాథమికోన్నత పాఠశాలలకు వెళ్లాల్సి ఉంటుంది. రోజు కాలినడకన వెళ్లలేని పరిస్థితి. పోని ప్రభుత్వమేమైన వాహన సౌకర్యం కల్పిస్తుందా అంటే గత ప్రభుత్వం ఇచ్చిన సైకిళ్లనే నిలిపివేసింది. ఇప్పుడు వీళ్లకు కొత్తగా ఇస్తారని భావించడం లేము. జాతీయ విద్యా విధానం ప్రకారం ప్రతి కిలోమీటర్ కు ఒక పాఠశాల ఉండాలన్న నిబంధన ఎందుకు అమలు చేయలేదు విద్యార్థులు కిలోమీటర్లు ప్రయాణించి ఏవిధంగా చదువుకుంటారు.  విద్యార్థులను గ్రామాలకు దూరం చేస్తున్నారు.
    
మీ నిర్లక్ష్యపూరిత చర్యలతో ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల బాలబాలికలు ప్రాథమిక విద్యకు కూడా దూరం చేస్తున్నారు. ఇప్పటికే మీరు పీజీ విద్యార్ధులకు అన్యాయంగా జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలను రద్దు చేసి బడుగు బలహీన వర్గాలు, వెనుకబడిన వర్గాలకు పీజీ విద్యను దూరం చేశారు. అంతే కాకుండా విదేశీ విద్యను సైతం రద్దు చేసి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కాపు విద్యార్దులకు ఉన్నత విద్యను దూరం చేశారు.
                                         

కే.ఎస్. జవహార్,
మాజీ మంత్రివర్యులు.


 

PREV
click me!

Recommended Stories

మార్కాపురం ప్రమాదంపై మంత్రుల ప్రెస్ మీట్ | Markapuram Bus Incident | Asianet News Telugu
అసెంబ్లీ లో సీఎం చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్ | CM Chandrababu Powerful Speech in Assembly