జగన్ అక్రమాలు కనిపించడం లేదా .. ఉండవల్లి మేధావి కాదు, ఊసరవెల్లి : అయ్యన్నపాత్రుడు ఘాటు వ్యాఖ్యలు

Siva Kodati | Published : Sep 27, 2023 6:37 PM
Google News Follow Us

సారాంశం

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌పై మండిపడ్డారు టీడీపీ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు. జగన్ పాలనలో తిరుమల కొండపై ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయని.. వీటిపై అరుణ్ కుమార్ నోరు మెదపడం లేదని అయ్యన్నపాత్రుడు చురకలంటించారు.

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌పై మండిపడ్డారు టీడీపీ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉండవల్లి ఓ ఊసరవెల్లి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసును సీబీఐ అధికారులకు ఇవ్వాలని అడగటం ఏంటని అయ్యన్నపాత్రుడు నిలదీశారు. స్కిల్ కేసులో ఒక్క ఆధారం అయినా వుందా.. వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబును జగన్ జైల్లో పెట్టించారని ఆయన ఆరోపించారు. దీనికి ఉండవల్లి వత్తాసు పలికారని అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనలో బ్రాందీ సీసాలు చూపించిన జగన్ ఇప్పుడు తన హయాంలో ఎందుకు కళ్లు మూసుకున్నారని ఆయన ప్రశ్నించారు. 

జగన్ పాలనలో తిరుమల కొండపై ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయని.. వీటిపై అరుణ్ కుమార్ నోరు మెదపడం లేదని అయ్యన్నపాత్రుడు చురకలంటించారు. ఆయనకు పక్కనే వున్న గోదావరిలో ఇసుక మాయం అయిపోతున్నా.. ఎందుకు మాట్లాడటం లేదని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. రామోజీరావుపై ఎవ్వరూ ఫిర్యాదు చేయకపోయినా ఆయనను జగన్ ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ డైరెక్షన్‌లోనే అరుణ్ కుమార్ పనిచేస్తున్నారని.. ఉండవల్లి మేధావి కాదు ఊసరవెల్లి అనే పరిస్ధితి వచ్చిందన్నారు. 

ALso Read: ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసు సీబీఐ విచారణకుఉండవల్లి పిటిషన్: వేరే బెంచ్ కు బదిలీ చేయాలని జడ్జి ఆదేశం

కాగా.. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ నెల  22న ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ స్కాంలో అంతరాష్ట్ర సమస్యలున్నాయని  ఉండవల్లి అరుణ్ కుమార్ పేర్కొన్నారు. ఇది తీవ్రమైన ఆర్ధిక నేరంగా ఆయన ఆ పిటిషన్ లో అభిప్రాయపడ్డారు. ఈ కేసును ఈడీ విచారిస్తున్న విషయాన్ని కూడా  ఉండవల్లి అరుణ్ కుమార్ ఆ పిటిషన్ లో ప్రస్తావించారు. ఈ క్రమంలోనే ఉండవల్లిపై టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు