హత్యలతో టీడీపీ కార్యకర్తలకు బెదిరింపులు.. ఖబడ్దార్ జగన్ రెడ్డి : అచ్చన్నాయుడు

By AN TeluguFirst Published Jan 4, 2021, 9:17 AM IST
Highlights

హత్యలతో టీడీపీ కార్యకర్తలను బెదిరించాలని చూస్తే ఖబడ్దార్ జగన్ రెడ్డి అంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో హెచ్చరించారు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని హత్యల ఆంధ్ర‌ప్రదేశ్‌గా మారుస్తున్నారని మండిపడ్డారు.  
 

హత్యలతో టీడీపీ కార్యకర్తలను బెదిరించాలని చూస్తే ఖబడ్దార్ జగన్ రెడ్డి అంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో హెచ్చరించారు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని హత్యల ఆంధ్ర‌ప్రదేశ్‌గా మారుస్తున్నారని మండిపడ్డారు.  

గుంటూరు జిల్లా గురజాలలో టీడీపీ మాజీ సర్పంచ్ అంకులును దారుణంగా హత్య చేయడాన్ని టీడీపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. బాధిత కుటుంబానికి టీడీపీ అన్ని విధాలా అండగా నిలబడుతుందని ఆయన స్పష్టం చేశారు. నిందితులను 24 గంటలలోపు అరెస్టు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. 

తలకెక్కిన వైసీపీ అహంకారాన్ని, మదాన్ని దించే రోజులు దగ్గర పడ్డాయన్నారు. వైసీపీని ప్రజలు మోకాళ్ల మీద నిలబెట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రజా సమస్యలు పక్కదారి పట్టించేందుకే వారానికొక టీడీపీ కార్యకర్తను పొట్టనపెట్టుకుంటున్నారని అచ్చెన్న మండిపడ్డారు.

రాష్ట్రంలో క్రూరత్వాన్ని జగన్ రెడ్డి పాలుపోసి పెంచుతున్నారని, పులివెందుల ప్యాక్షనిజాన్ని  రాష్ట్ర వ్యాప్తం చేసి రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఏ నియంత పాలనలోనూ లేని అరాచకాలు, దౌర్జన్యాలు జగన్ రెడ్డి పాలనలో చూస్తున్నామన్నారు. ప్రశ్నిస్తే దాడులు, నిలదీస్తే హత్యలు చేసుకుంటూ పోతే రాష్ట్రంలో ఎవరూ మిగలరని తెలిపారు. రాష్ట్రంలో భయానక పరిస్థితులు నెలకొల్పారని అచ్చెన్నాయుడు అన్నారు. 

click me!