అంబేద్కర్ కు భారతరత్న... ఎన్టీఆర్ కృషి ఫలితమే: చంద్రబాబు

By Arun Kumar PFirst Published Apr 14, 2020, 11:35 AM IST
Highlights

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. 

గుంటూరు: భారత రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ జయంతి సందర్భంగా టిడిపి అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాళులు  అర్పించారు. ఆ మహానుభావున్ని తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి గౌరవించుకుంటూ వస్తోందని... ఆయనకు భారతరత్న రావడంలో మాజీ ముఖ్యమంత్రి, ఆనాటి నేషనల్ ఫ్రంట్ కన్వీనర్ ఎన్టీఆర్ కృషి ఎంతో వుందని చంద్రబాబు పేర్కొన్నారు. 

''సామాజిక ఐకమత్యానికి అడ్డుగా నిలుస్తున్న కులాల భావన నుంచి స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం వంటి ప్రజాస్వామ్య సిద్ధాంతాలపై ఆధారపడే నూతన సమాజాన్ని నిర్మించడంలో అంబేద్కర్ చేసిన కృషి సాటిలేనిది. ఆ మహానుభావుడు రూపొందించిన రాజ్యాంగం వల్లే ఈరోజు పేదలకు న్యాయం జరుగుతోంది''  అంటూ అంబేద్కర్ గొప్పతనాన్ని వివరించారు.  

''అంబేద్కర్ ఆశయాలను దేశంలో తొలుత అమలు చేసింది ఎన్టీఆర్. 1990లో అంబేద్కర్ మహాశయునికి భారతరత్న ప్రకటించడంలో నాడు నేషనల్ ఫ్రంట్ కన్వీనర్ గా ఉన్న ఎన్టీఆర్ ఎంతో కృషిచేశారు. పార్లమెంటులో అంబేద్కర్ కాంస్య విగ్రహం ఏర్పాటులో కూడా తెలుగుదేశం పట్టుదల ఉంది'' అని చంద్రబాబు వెల్లడించారు.  

''నేను ఉమ్మడిరాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదటిసారి ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి కోసం 2003లో జస్టిస్ పున్నయ్య కమిషన్ ను నియమించిన పార్టీ తెలుగుదేశమే. గత తెదేపా హయాంలో రూ.40,253కోట్లను ఎస్సీల సంక్షేమానికి కేటాయించాం'' అంటూ టిడిపి హయాంలో ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి కోసం చేపట్టిన పనులను వివరించారు. 

''అమరావతిలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహంతో పాటు స్మృతి వనం నిర్మాణం ప్రారంభించాం. ఎస్సీ విద్యార్థుల విదేశీ విద్యకు రూ.15 లక్షల ఆర్థిక సాయం అందిస్తూ ఆ పథకానికి అంబేద్కర్ విదేశీ విద్యానిధి అని పేరుపెట్టాం. ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహాశయుని స్మృతికి నివాళులు''  అంటూ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని వరుస ట్వీట్లు చేశారు చంద్రబాబు.  

click me!