‘అన్నన్న జగనన్నా.. వెంకన్నకే సున్నం పెట్టారా?’

By Galam Venkata RaoFirst Published Jul 8, 2024, 11:25 PM IST
Highlights

టీటీడీ మాజీ ఈవో ఏవీ ధర్మారెడ్డి, మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌కు తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేసింది. వైసీపీకి లబ్ధి చేకూర్చేందుకు ధర్మారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి అక్రమాలకు తెగబడ్డారని, సాంప్రదాయాలకు విరుద్ధంగా నడుచుకున్నారని తెలుగుదేశం జాతీయ అధికార ప్రతినిధి గురజాల మాల్యాద్రి, రాష్ట్ర అధికార ప్రతినిధి నీలయపాలెం విజయ్ కుమార్ ఆరోపించారు.

తిరుమల.. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారు కొలువైన ఇల వైకుంఠం. హిందువులు పరమ పవిత్రంగా భావించే పుణ్యక్షేత్రం. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చేస్తారు. అయితే, గత ప్రభుత్వం రాజకీయాల కోసం తిరుమలను వాడుకుందన్న అపవాదు ఉంది. వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నడిపించిన పాలకమండలిపై విపరీతంగా ఆరోపణలు ఉన్నాయి. గడిచిన ఐదేళ్లలో బోర్డుపై వచ్చినన్ని ఆరోపణలు, విమర్శలు గతంలో ఎన్నడూ రాలేదు. ఒకానొక దశలో భక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. రాజకీయ నాయకులు, వీఐపీలకు తిరుమలలో పెద్దపీట వేస్తూ.. సామాన్య భక్తులను ఇబ్బందులకు గురిచేశారన్న అనేక మంది బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేశారు. భక్తిభావంతో, ఆధ్యాత్మిక చింతనతో తిరుమలకు వెళ్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందన్న భావన భక్తులు ఉండేది. ఇదే కాకుండా తిరుమల శ్రీవారి భక్తులకు మెరుగైన సేవలందించేందుకు పనిచేయాల్సిన టీటీడీ పాలక మండలి అధ్యక్షుడు, ఈవో జగన్‌ సేవలో జగన్‌ కోసం తరించారన్న ఆరోపణలు ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా ప్రభుత్వం మారడంతో ఇక్కడి నుంచే ప్రక్షాళన మొదలైంది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే తిరుమలలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొనడంతో ఆయన కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల నుంచి ప్రక్షాళన మొదలు పెడతానని చెప్పారు. అన్నట్లుగా చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన రోజుల వ్యవధిలోనే ఈఓ మార్పుతో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. పాత ఈవోను సాగనంపి.. కొత్త ఈవోగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి జె.శ్యామలరావును నియమించారు. 

Latest Videos

ఈ నేపథ్యంలో టీటీడీ మాజీ ఈవో ఏవీ ధర్మారెడ్డి, మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌కు తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేసింది. వైసీపీకి లబ్ధి చేకూర్చేందుకు ధర్మారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి అక్రమాలకు తెగబడ్డారని, సాంప్రదాయాలకు విరుద్ధంగా నడుచుకున్నారని తెలుగుదేశం జాతీయ అధికార ప్రతినిధి గురజాల మాల్యాద్రి, రాష్ట్ర అధికార ప్రతినిధి నీలయపాలెం విజయ్ కుమార్ ఆరోపించారు. వారిపై సీబీ సీఐడీ లేదా విజిలెన్స్ శాఖతో విచారణ జరిపించి అక్రమాలను వెలికి తీయాలని కోరారు. ఈ మేరకు సీఎస్‌కు టీడీపీ నేతలు లేఖ రాశారు. 

లేఖలోని ప్రధాన అంశాలు :
రాజశేఖర్ రెడ్డి మాదిరిగానే సాంప్రదాయానికి విరుద్ధంగా IAS అధికారికి కాకుండా ధర్మారెడ్డిని JEOగా, తర్వాత EOగా జగన్ రెడ్డి ప్రభుత్వం నియమించింది.
తిరుమల శ్రీవారిని దర్శించుకునే బడా పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలతో తనకున్న పరిచయాలను దుర్వినియోగం చేస్తూ ఎన్నికల సమయంలో వైసీపీకి విరాళాల సేకరణకు మార్గంగా ధర్మారెడ్డి వ్యవహరించారు.
తిరుమలలో గెస్ట్‌హౌస్‌లకు కేటాయించే భూముల్లో కూడా ధర్మారెడ్డి సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ పాటించలేదు. ఫర్నిచర్ల మార్పు పేరుతో కోట్ల రూపాయిలు పక్కదారి పట్టించారు.
భక్తులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నా.... జగన్ రెడ్డిపై పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసులు, వైసీపీ రాజకీయ వ్యవహారాలు చక్కబెట్టేందుకు ధర్మారెడ్డి ఢిల్లీకి తరచూ వెళ్తుండేవారు.
ధర్మారెడ్డి మొబైల్ ఫోన్ కాల్ డేటాను పరిశీలిస్తే క్రిమినల్ కేసుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కాపాడేందుకు ఢిల్లీలో ఆయన రాజకీయ ప్రమేయం, కుతంత్రాలు స్పష్టంగా తేటతెల్లమవుతాయి.
రూ.2 కోట్ల విలువ గల డైమెండ్ వాచ్‌ను హైకోర్టు జడ్జికి ఆఫర్ చేశారనే వదంతులు కూడా ధర్మారెడ్డిపై ఉన్నాయి.
మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డిలిద్దరూ బడ్జెట్‌తో సంబంధం లేకుండా ఇష్టానుసారంగా సివిల్ కాంట్రాక్టులకు టీటీడీ నిధులను పక్కదారి పట్టించారు.
బడ్జెట్ పరిమితిని అధిగమించి మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి రూ.475 కోట్లకు పెంచగా.. అనంతరం చైర్మన్‌ అయిన కరుణాకర్ రెడ్డి భారీగా రూ.1,772 కోట్లకు పెంచి తీవ్ర అక్రమాలకు పాల్పడ్డారు.
ఎన్నికల్లో భూమన అభినయ్ రెడ్డికి లబ్ధి చేకూర్చేందుకు టీటీడీలో ధర్మారెడ్డి, కరుణాకర్ రెడ్డి అక్రమాలు తెగబడ్డారు.
శ్రీవాణి టెకెట్లు పేరుతో రూ.10,500 వసూలు చేసి ఆ డబ్బులు ఏ రకంగా ఖర్చు చేశారో చూపించలేదు.
ఎవరు టీటీడీకి విరాళాలు ఇచ్చినా అవి శ్రీవాణి ట్రస్ట్ అకౌంట్‌లోకి జమవ్వడంతో టీటీడీ బోర్డు అనుమతి లేకుండానే ఏ పని అయినా చేసుకునేలా అవకాశం కల్పించారు.
పద్మావతి ఆసుపత్రి (రూ.550 కోట్లు), బాలాజీ ఇన్‌స్టిట్యూట్ (రూ.324 కోట్లు), స్విమ్స్ కార్డియో న్యూరో బ్లాక్ నిర్మాణాల్లో కూడా భారీ అక్రమాలకు పాల్పడ్డారు.
ఆసుపత్రుల నిర్మాణానికి రూ.1 కోటి నుంచి రూ.1.5 కోట్లు విరాళం ఇచ్చే భక్తులకు 531 ఉదయాస్తమాన సేవా టికెట్లు ఇచ్చి భారీ కుంభకోణానికి తెర లేపారు.
రూ.200 కోట్లతో తిరుమలలో కర్ణాటక ప్రభుత్వ యాత్రా సముదాయం నిర్మాణం విషయంలో టీటీడీ కర్ణాటక ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నిర్మాణ పనులు చేపట్టడానికి అనుమతించాలని ఒత్తిడి తెచ్చింది.
తిరుమలలో గెస్ట్ హౌస్‌ల నిర్మాణం, విరాళాల విషయంలో వ్యక్తిగత దాతల విషయంలో టీటీడీ పూర్తిగా భిన్నమైన పద్ధతిని అవలంబించింది.
తిరుమల కాంప్లెక్స్-5 నిర్మాణంలో రూ.98 కోట్లు కమిషన్ల రూపంలో పక్కదారి పట్టాయి.
వైసీపీ బడా నాయకుల సిఫార్సు చేసిన వారినే టీటీడీలోని సలహాదారులను, ఉద్యోగులుగా ధర్మారెడ్డి నియమించారు.

ఈ మేరకు సీఎస్‌కు రాసిన లేఖలో పేర్కొన్న తెలుగుదేశం నేతలు... టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి, మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్ రెడ్డిలపై సీబీ సీఐడీ లేదా విజిలెన్స్ శాఖతో విచారణ జరిపించి అక్రమాలను వెలికితీయాలని కోరారు.

click me!