
టీడీపీ (tdp) అధినేత, ప్రతిపక్షనేత నారా చంద్రబాబు నాయుడు (chandrababu naidu) బుధవారం నుంచి మూడు రోజుల పాటు తన సొంత నియోజకవర్గం కుప్పంలో (kuppam) పర్యటించనున్నారు. బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన ఆయన కాసేపటి క్రితం బెంగళూరు చేరుకున్నారు. బెంగళూరు నుంచి రోడ్డు మార్గం మీదుగా ఆయన కుప్పం చేరుకుంటారు.
విద్యుత్ చార్జీలతో పాటు ఆర్జీసీ చార్జీలను పెంచడంపై జగన్ సర్కారు తీరును నిరసిస్తూ బాదుడే బాదుడు పేరిట టీడీపీ నిరసనలను చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కుప్పంలో నిర్వహించనున్న బాదుడే బాదుడు కార్యక్రమంలో పాలుపంచుకునేందుకే చంద్రబాబు తన సొంత నియోజకవర్గానికి వెళుతున్నారు. ఈ పర్యటనలో భాగంగా కుప్పంతో పాటు నియోజకవర్గ పరిధిలోని శాంతిపురం, గుడిపల్లె మండలాల్లోనూ చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు.
అంతకుముందు పేపర్ లీకేజ్ ఘటనలో మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ను (narayana arrest) సీరియస్గా తీసుకున్న చంద్రబాబు.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా (amit shah), రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ (biswabhushan harichandan) కు లేఖ రాసారు.
నారాయణ అరెస్ట్ రాజకీయ కక్షలో భాగంగానే జరిగిందని అమిత్ షాకు రాసిన లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. తప్పుడు సాక్ష్యాలు సృష్టించి ఆయనను అరెస్ట్ చేసారన్నారు. హైదరాబాద్ లో అరెస్ట్ చేసి చిత్తూరు తరలించడం ద్వారా జాప్యం జరిగేలా చూడటం వెనుక కూడా దురుద్దేశ్యం ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా ఎస్పీ అధికార వైసిపి కి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.
హైదరాబాద్ నుండి చిత్తూరుకు 8నుండి పది గంటల్లో చేరుకోవచ్చని... కానీ ఉదయం అరెస్ట్ చేసి రాత్రివరకు నారాయణను చిత్తూరుకు తీసుకువెళ్లలేదని అన్నారు. కోర్టులో ప్రవేశపెట్టకూడదనే ఉద్దేశంతోనే ఇలా జాప్యం చేసారని చంద్రబాబు ఆరోపించారు.
గతంలో ఇలాగే వైసిపి ఎంపి రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ సమయం జరిగిన ఉదంతాన్ని అమిత్ షాకు రాసిన లేఖలో ప్రస్తావించిన చంద్రబాబు. ఆయనను ఇలాగే హైదరాబాద్ లో అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చకుండా పోలీస్ కస్టడీలో వుంచి ఇబ్బంది పెట్టారని గుర్తుచేసారు. ఇప్పుడు కూడా అలాగే నారాయణను పోలీసు కస్టడీలో ఉంచే ప్రయత్నం చేస్తున్నారంటూ చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేసారు.
పేపర్ లీకేజీ కేసులో అదనపు సెక్షన్ లు జోడించి నారాయణను అక్రమ అరెస్ట్ చేసారని చంద్రబాబు అన్నారు. కాబట్టి వెంటనే జోక్యం చేసుకుని తగిన న్యాయం జరిగేలా చూడాలని అమిత్ షా ను చంద్రబాబు కోరారు. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న పోలీస్ అధికారుల చర్యలు తీసుకోవాలి చంద్రబాబు లేఖ ద్వారా కేంద్ర హోంమంత్రి, గవర్నర్ ను కోరారు.
అంతకుముందు నారాయణ అరెస్ట్ పై చంద్రబాబు ఖండించారు. టెన్త్ పరీక్షల నిర్వహణ వైఫల్యాన్నీ కప్పిపుచ్చేందుకు నారాయణను అరెస్ట్ చేశారని ఆరోపించారు. మాస్ కాపీయింగ్, పరీక్షల నిర్వహణలో వైఫల్యాలకు నారాయణను బాధ్యులను ఎలా చేస్తారని ఆయన ప్రశ్నించారు. ముందస్తు నోటీసు లేకుండా ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయడం కక్షపూరిత చర్య కాదా అని ఆయన ప్రశ్నించారు. వైసిపి అధికారంలోకి వచ్చినప్పటి నుండి నారాయణపై కక్ష కట్టారు.
ఇదిలావుంటే చిత్తూరు పోలీసుల అభియోగాలను తోసిపుచ్చిన న్యాయస్థానం నారాయణకు బెయిల్ మంజూరు చేసింది. మంగళవారం రాత్రి జిల్లా ప్రభుత్వాసుపత్రిలో వైద్యపరీక్షల అనంతరం నారాయణను కోర్టులో హాజరుపర్చారు పోలీసులు. ఈ సందర్భంగా ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి సులోచనారాణి వ్యక్తిగత పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేశారు. రూ. లక్ష చొప్పున ఇద్దరు జామీను ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు.